Share News

Hyderabad: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-25%పెంపు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:11 AM

11 సంవత్సరాల తర్వాత రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు ఉత్తర్వ్యులను జారీ చేశారు.

Hyderabad: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-25%పెంపు..

  • 1,375 చికిత్సల రేట్లు మార్పు

  • కొత్తగా 163 ప్యాకేజీల చేర్పు

  • జీవో విడుదల చేసిన సర్కారు

  • 1375 వైద్య చికిత్సల ధరలు సవరిస్తూ జీవో

హైదరాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): 11 సంవత్సరాల తర్వాత రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య చికిత్సల ధరలను సర్కారు సవరించింది. ఈ మేరకు 1,375 రకాల వైద్య చికిత్సల ధరలను సవరిస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్థు ఉత్తర్వ్యులను జారీ చేశారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్యశ్రీ చికిత్స ధరల సవరణ జీవోను వైద్య ఆరోగ్యమంత్రి దామోదర రాజనర్సింహ విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద మొత్తం 1,672 వైద్య సేవలు అందుబాటులో ఉండగా వీటిలో 297 మినహా మిగిలిన వైద్యసేవ(ప్యాకేజీ)ల రేట్లను పెంచారు. ఆరోగ్యశ్రీలో కొత్తగా 163 ప్యాకేజీలను చేర్చినట్లు జీవోలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ సర్కారు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలకు సంబంధించిన రివైజ్డ్‌ రేట్ల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక సగటున 20-25 శాతం మేర చికిత్సల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.


తాజా నిర్ణయం వల్ల సర్కారుపై ఏటా అదనంగా రూ.487 కోట్ల భారం పడుతుందని, ధరల సవరణ ద్వారా 79 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో 1,042 సర్కారీ దవాఖానాలుండగా, 368 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. తాజా రేట్ల ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి ఏటా రూ.10 లక్షల మేర ఉచిత వైద్యం అందుతుందని జీవోలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబరులో ఈ పథకం పరిమిఽతిని కాంగ్రెస్‌ సర్కారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అలాగే కొత్తగా 163 ఆరోగ్య ప్యాకేజీలను గుర్తించింది. తాజాగా చికిత్స ధరల పెంపు కారణంగా రూ.140 కోట్లు, కొత్త ప్యాకేజీల చేర్పు వల్ల మరో రూ.348 కోట్లు మొత్తంగా రూ.488 కోట్ల మేర ఏటా సర్కారుపై అదనపు భారం పడనుందని వైద్యవర్గాలు వివరించాయి. కొత్త ప్యాకేజీల వల్ల 1.5 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


గుండె చికిత్సలో కొత్తగా 12 ప్యాకేజీలు:

కొత్తగా ఆర్యోగ్యశ్రీలో 163 ప్యాకేజీలను ప్రవేశపెట్టగా వాటిలో గుండె చికిత్సకు సంబంధించి 12 ప్యాకేజీలు ఉన్నాయి. వాటిలో కార్జియాలజీ, కార్డియోఽథొరాసిక్‌ సర్జరీలు ఉండగా, మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ అక్యూట్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌(సీహెచ్‌ఎ్‌ఫ)/స్టక్‌ మెడికల్‌ మేనేజ్‌మెంట్‌కు రూ.44 వేల ప్యాకేజీని ఖరారు చేశారు. అలాగే డెర్మటాలజీలో 2, ఎండోక్రైనాలజీలో 7 ప్యాకేజీలు చేర్చగా, ఇందులో డయాబెటిక్‌ కీటో ఎసిడోసి్‌సకు రూ.44 వేల ప్యాకేజీ ఖరారు చేశారు. అలాగే జనరల్‌ మెడిసిన్‌లో 3, జనరల్‌ సర్జన్‌లో 15, జీరియాట్రిక్‌ మెడిసిన్‌లో 1, ఇంటర్వెన్షనల్‌ రేడియాలజీలో 17, మెడికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీలో 9, నెఫ్రాలజీలో 16, న్యూరాలజీలో 8, న్యూరో సర్జరీలో 18, న్యూక్లియర్‌ మెడిసిన్‌లో 3, ప్లాస్టిక్‌ సర్జరీలో 9, పల్మనాలజీలో 3, రేడియేషన్‌ ఆంకాలజీలో 3, రుమటాలజీలో 7, సర్జికల్‌ ఆంకాలజీలో 9, యూరాలజీలో 11, వాస్క్యులర్‌ సర్జరీలో 6 ప్యాకేజీలు కొత్తగా చేర్చారు. అలాగే ల్యాప్రోస్కోపిక్‌, రోబోటిక్‌ సర్జరీ, టైప్‌-1 డయాబెటిక్‌కు ఇన్సులిన్‌ పంప్స్‌, అఫెరిసిస్‌ వంటివి ఆరోగ్యశ్రీలోకి కొత్తగా తీసుకురాగా ఇన్సులిన్‌ పంప్స్‌కు రూ. 2 లక్షల వరకు ప్యాకేజీ నిర్ణయించారు.

Updated Date - Jul 23 , 2024 | 03:11 AM