Share News

Krishna Basin: జూరాలకు బిరబిరా కృష్ణమ్మ..

ABN , Publish Date - Jul 18 , 2024 | 03:25 AM

కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండు కుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారమే తెరవగా.. బుధవారం నారాయణ పూర్‌ గేట్లను తెరిచారు. ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

Krishna Basin: జూరాలకు బిరబిరా కృష్ణమ్మ..

  • ఆల్మట్టికి భారీగా వరద.. నారాయణపూర్‌ నుంచి 62,955 క్యూసెక్కుల విడుదల

  • శ్రీశైలానికి 3,585, సాగర్‌కు 21,481 క్యూసెక్కులు.. గోదావరికి కొనసాగుతున్న వరద

  • భద్రాచలంలో పెరుగుతున్న నీటిమట్టం.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు

  • ఇందూరు, ములుగు జిల్లాల్లో భారీగా.. నవీపేటలో 15.4, వెంకటాపురంలో 10.7 సెం.మీ

  • నేడు, రేపు అతి భారీ వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కృష్ణా బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని కీలక ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలు నిండు కుండలా మారాయి. ఆల్మట్టి గేట్లను మంగళవారమే తెరవగా.. బుధవారం నారాయణ పూర్‌ గేట్లను తెరిచారు. ఆ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 62,955 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో గద్వాల జిల్లాలోని జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాలకు గురువారం సాయంత్రం వరకు వరద చేరే అవకాశముందని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జూరాలకు 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 7,500 క్యూసెక్కులు దిగువకు విడిచి జల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.


ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టికి 92,736 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. పూర్తి సామర్థ్యం 129 టీఎంసీలకు ఇప్పటికే నిల్వ 100 టీఎంసీలు దాటింది. దీంతో దిగువకు 65 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణపూర్‌ జలాశయం పూర్తి సామర్థ్యం 37 టీఎంసీలకు.. నిల్వ ఇప్పటికే 30 టీఎంసీలకు చేరింది. కృష్ణానదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది. 49,522 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 3,585 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో జల విద్యుదుత్పత్తిని ప్రారంభించి 22,166 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 33.62 టీఎంసీలున్నాయి. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు.. ప్రస్తుతం 122 టీఎంసీలున్నాయి. 21,481 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. దీంతో ఏపీ తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి 9 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను బుధవారం నుంచి ప్రారంభించారు. గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 4,468 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 13.833 టీఎంసీలున్నాయి.


కడెం ప్రాజెక్టుకు 3,442 క్యూసెక్కులు, ఎల్లంపల్లి, సింగూరుకు 391 క్యూసెక్కుల వరద రికార్డయింది. సుందిళ్లకు 331 క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 9,500 క్యూసెక్కులు, మేడిగడ్డ బ్యారేజీకి 49,500 క్యూసెక్కులు, సమ్మక్కసాగర్‌(తుపాకులగూడెం)కు 78,450 క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌(దుమ్ముగూడెం)కు 94 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. ఇటు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి 68 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. ఎగువన భారీ వర్షాలు.. సమక్క బ్యారేజీ, తాలిపేరు నుంచి నీటి విడుదలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ భారీగా పెరుగుతోంది. స్నాన ఘట్టాలపైకి వరద నీరు చేరుకుంది. గురువారం నాటికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 25-30 అడుగులకు చేరే అవకాశముందని కేంద్ర జలసంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్‌లో తొలిసారి భద్రాచలం వద్ద గోదావరి 25 అడుగులను దాటనుంది.


పలు జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, ములుగు, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వానలు పడగా.. నల్లగొండ, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలుచోట్ల చెరువులు, వాగులు వంకలు పొంగిపొర్లాయి. అక్కడక్కడ సోయా, పత్తి తదితర పంటలు నీటమునిగాయి. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో అత్యధికంగా 15.4 సెం.మీ., ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు)లో 10.7, అదే జిల్లా మంగపేటలో 9, ఏటూరునాగారంలో 9.8, ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో 7.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు జిల్లాలో 6.4 సెం.మీ. సగటు వర్షపాతం నమోదైంది.


తాడ్వాయి మండలం పడిగాపూర్‌కు చెందిన పొనక వినోద్‌ తన ఆటోతో జంపన్నవాగుపై ఉన్న లోలెవల్‌ కాజ్‌వేను దాటుతుండగా.. ప్రవాహానికి ఆటో కొట్టుకుపోయి కాజ్‌వే కింద బోల్తా పడింది. వినోద్‌ సురక్షితంగా బయటపడగా.. ఆటోను స్థానికులు బయటకు తీశారు. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంపన్నవాగులో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. బొగత, కుంటాల, పొచ్చెర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. బొగత వద్ద వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. పర్యాటకులపై పోలీసులు ఆంక్షలు విధించారు.


రెండ్రోజులు అతి భారీ వర్షాలు

రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నాడు కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, నిజామాబాద్‌, నిర్మల్‌, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల, నారాయణపేట, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ 10 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక అల్పపీడన ప్రాంతం ఈ నెల 19వ తేదీన పశ్చిమ మధ్య దాని పరిసర వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.

Updated Date - Jul 18 , 2024 | 03:25 AM