Share News

Supreme Court: కవితకు బెయిల్‌ వచ్చేనా?

ABN , Publish Date - Aug 27 , 2024 | 05:05 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

Supreme Court: కవితకు బెయిల్‌ వచ్చేనా?

  • నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ మద్యం కేసు విచారణ

న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత తొలుత తన కుమారుడికి పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని రౌస్‌ అవెన్యూ కోర్టును కోరగా.. న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే..! ఆ తర్వాత ఈడీ, సీబీఐ కేసుల్లో సాధారణ బెయిల్‌ ఇవ్వలని ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ వేసినా.. నిరాశే ఎదురైంది. ట్రయల్‌ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు సైతం బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ కవితతోపాటు మరో నలుగురిపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.


అయితే, ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధమే లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతే బెయిల్‌ ఇస్తామని చెప్పింది. ఈ నెల 20న మరోసారి వాదనలు జరిగాయి.


సీబీఐ, ఈడీ కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం మరోసారి తేల్చిచెప్పింది. అయితే.. ఈ కేసులో సీబీఐ కౌంటర్‌ దా ఖలు చేసిందని, ఈడీ కౌంటర్‌ దాఖలు చేయడానికి సమ యమివ్వాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు న్యాయస్థానాన్ని కోరారు. ఇరువర్గాల వాదనల అనంతరం గురువారంలోపు కౌంటర్‌ దా ఖలు చేయాలని ఈడీ తరఫు న్యాయవాదిని.. శుక్రవారంలోపు రిజాయిండర్‌ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వే సింది. అయితే.. ఈడీ గురువారమే 150 పేజీలతో కౌంటర్‌ దాఖలు చేసినట్లు తెలిసింది.


  • ఢిల్లీకి కేటీఆర్‌, హరీశ్‌, గంగుల

ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్‌పై మంగళవారం వాదనలు జరగనున్న నేపథ్యంలో ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, రాజ్యసభ సభ్యు లు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత తరపున వాదనలను వినిపిస్తున్న న్యాయవాదులతో కేటీఆర్‌, హరీశ్‌ భేటీ అయినట్లు తెలిసింది. కవితకు బెయిల్‌ వచ్చే అవకాశాలు, కోర్టులో లేవనెత్తాల్సిన అంశాలు, దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన కౌంటర్లు తదితర అంశాలపై వీరు చర్చించినట్లు సమాచారం. కవితకు మంగళవారం బెయిల్‌ తప్పనిసరిగా వస్తుందనే ఆశలో కేటీఆర్‌, హరీశ్‌ రావుతోపాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 05:05 AM