Share News

Fake liquor: దుబాయ్‌లో జగమేమాయ!

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:22 AM

కల్తీ కల్లుకు బానిసలైన తెలంగాణ పౌరులు కొందరు పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వచ్చి జగమే మాయ అంటున్నారు. అలవాటైన కల్తీ కల్లు ద్వారా లభించే మత్తు దొరక్క తామొచ్చిన పనిని మరిచి పిచ్చెక్కిపోతున్నారు.

Fake liquor: దుబాయ్‌లో జగమేమాయ!

  • కల్తీ కల్లుకు బానిసలైన తెలంగాణ వాసుల పాట్లు

  • మత్తు దొరక్క నానావస్థలు పడి కొందరి మరణం

  • మరికొందరు స్వదేశానికి తిరుగుప్రయాణం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): కల్తీ కల్లుకు బానిసలైన తెలంగాణ పౌరులు కొందరు పొట్టకూటి కోసం ఎడారి దేశాలకు వచ్చి జగమే మాయ అంటున్నారు. అలవాటైన కల్తీ కల్లు ద్వారా లభించే మత్తు దొరక్క తామొచ్చిన పనిని మరిచి పిచ్చెక్కిపోతున్నారు. కొందరు పిచ్చి చేష్టలతో తిరుగుతూ మృత్యువాత పడుతుంటే.. మరికొందరు స్వదేశానికి తిరుగుటపా కడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు, వారికి ఉద్యోగాలు ఇప్పించిన ఏజెన్సీలు తీవ్రంగా నష్టపోతున్నాయి.


దుబాయ్‌లో ఇటీవల మరణించిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటకు చెందిన ఆవుల ఓదేలు విషాదాంతం ఈ పరిస్థితికి నిదర్శనం. దాదాపు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓదేలు మృతదేహం ఇక్కడి సోనాపూర్‌ పరిసరాల్లోని ఇసుక దిబ్బల్లో ఈ నెల ప్రారంభంలో దుబాయ్‌ పోలీసులకు దొరికింది. ఓదేలు మృతదేహం బుధవారం స్వదేశానికి చేరింది. 30 రోజుల విజిటింగ్‌ వీసాతో దుబాయ్‌ వచ్చిన ఓదేలు ఓ నిర్మాణ కంపెనీలో పనిలో చేరాడు. కానీ, మత్తుకు బానిసైన ఓదేలు అది లేకుండా ఉండలేకపోయినట్లు సమాచారం. మత్తు లభించక పిచ్చిగా ప్రవర్తించేవాడని, కంపెనీ బస్సుల ముందు నిద్రపోయేవాడని ఇతర కార్మికులు చెప్పారు. చివరికి పనికి కూడా వెళ్లకుండా కంపెనీ శిబిరంలోనే ఉండిపోయేవాడని, నిర్వాహకులు ఏసీలు ఆపేసినా బయటికిరాకుండా గదిలోనే ఉండేవాడని తెలిసింది.


ఈ పరిస్థితుల్లో ఆ కంపెనీ నుంచి పారిపోయిన ఓదేలు ఎడారిలో శవమై కనిపించాడు. కాగా, ప్రాణాంతకమైన ఆల్ర్ఫాజోలం, డైజోఫాం, క్లోరోఫాంతోపాటు క్రిమిసంహారక మందుల్లో వాడే ముడి పదార్ధాలను నీళ్లలో కలిపి కల్లుగా విక్రయిస్తుంటారు. ఈ కల్లు డ్రగ్స్‌ కంటే అధిక మోతాదులో మత్తు ఇస్తుండడంతో దీన్ని సేవించిన వారు ఆ మత్తుకు బానిసలవుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో గుల్ఫాం కల్లుగా పిలిచే ఈ కల్లుకు అలవాటుపడిన వారు అది లేకుండా ఒక్క రోజు కూడా గడపలేకపోతున్నారు.


ఓదేలు మాత్రమే కాదు.. దుబాయిలోని కంపెనీల్లో కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారిలో చాలా మంది ఈ కల్తీ కల్లు బానిసలు ఉన్నారు. వారు కూడా తాము అలవాటుపడిన మత్తు లభించక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దుబాయిలో ఉద్యోగం వద్దు, సొంతూరిలోనే కూలీనాలీ చేసుకుంటూ గుల్ఫాం కల్లు తాగుతూ బతికేస్తామని స్వదేశానికి తిరిగి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిపోతున్న వారి సంఖ్య పెరుగుతుండడం రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలకు సమస్యగా మారింది. రిప్లే్‌సమెంట్‌తో పాటు డిఫెక్టివ్‌ సర్వీసు కింద దుబాయి కంపెనీలు ఏజన్సీలకు ఇచ్చే కమీషన్లలో భారీగా కోతలు పెడుతున్నాయి.

Updated Date - Aug 23 , 2024 | 03:22 AM