Share News

Tummala Nageswara Rao : ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు

ABN , Publish Date - Jul 22 , 2024 | 05:02 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, దీన్ని గోదావరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పర్యవేక్షిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

 Tummala Nageswara Rao : ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి పెదవాగు ప్రాజెక్టుకు మరమ్మతులు

  • అవసరమైతే మరో 3 గేట్లను ఏర్పాటుచేస్తాం

  • రైతులను ఆదుకుంటాం: మంత్రి తుమ్మల

  • నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: తుమ్మల

ఖమ్మం, జూలై 21 (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అని, దీన్ని గోదావరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పర్యవేక్షిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ఉమ్మడిగా ఉన్న ఈ ప్రాజెక్టుకు వచ్చే ఏడాదిలోగా మరమ్మతులు పూర్తి చేయిస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదలతో గండిపడ్డ పెదవాగు ప్రాజెక్టును ఆదివారం అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ప్రాజెక్టుకు గండిపడిన విధానం, జరిగిననష్టాన్ని పరిశీలించారు.

అనంతరం గుమ్మడివల్లి, కొత్తూరు, రంగాపురం, నారాయణపురంలోని వరద బాధిత గ్రామాల ప్రజలతో మట్లాడారు. ఆ తర్వాత పెదవాగు ప్రాజెక్టు వద్ద జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెదవాగు ప్రాజెక్టు గండి పడడానికి కారణాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

వరద పరిస్థితిని అంచనావేసి ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తామని, అయితే మూడో గేటు మోటార్‌ కాలిపోవడంతో దానిని ఎత్తలేకపోయామని అధికారులు తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గోదావరి బోర్డు పర్యవేక్షణలో ఉన్న పెదవాగు ఆయకట్టు 80% ఏపీ, 20% తెలంగాణలో ఉందన్నారు. ఇదే నిష్పత్తిలో మరమ్మతులకు నిధులు కేటాయించాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న మూడుగేట్లతో పాటు మరో మూడు గేట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైతులను అన్ని విధాల ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కాగా, పెదవాగు ప్రాజెక్టుకు గండి పడిన విషయం తెలుసుకుని సకాలంలో సహాయక చర్యలు చేపట్టిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌ రాజ్‌ను మంత్రి తుమ్మల అభినందించారు.

Updated Date - Jul 22 , 2024 | 05:02 AM