Share News

Farmers: పామాయిల్‌ రైతులను ఆదుకోండి..

ABN , Publish Date - Jun 23 , 2024 | 03:34 AM

పామాయిల్‌ సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో శనివారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తాండూరులో పప్పుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.

Farmers: పామాయిల్‌ రైతులను ఆదుకోండి..

  • కేంద్ర మంత్రిని కోరిన మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పామాయిల్‌ సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాలని కోరుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో శనివారం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తాండూరులో పప్పుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు అధిక ధరలు అందించి పామాయిల్‌ సాగును లాభసాటిగా మార్చాలని కోరారు. పామాయిల్‌ గెలలకు కనీస మద్దతు ధర టన్నుకు రూ.15 వేలు, క్రూడ్‌ పాం ఆయిల్‌ ధర టన్నుకు రూ.లక్ష ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే క్రూడ్‌ పాం ఆయిల్‌ ధరలు స్థిరీకరించడానికి, దిగుమతి సుంకాన్ని విధించి దేశీయంగా పామాయిల్‌ సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాలని చెప్పారు.


తెలంగాణలో సుమారు 2 లక్షల ఎకరాలను పామాయిల్‌ సాగు చేపట్టినట్లు కేంద్రమంత్రికి వివరించారు. ప్రస్తుతం పామాయిల్‌ ధర టన్నుకు రూ.13,438 ఉందని, రైతులను ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని రాష్ట్రంలో పర్యటించాలని తుమ్మల ఆహ్వానించగా.. తుమ్మలను కూడా దిల్లీకి రావాలని కేంద్రమంత్రి ఆహ్వానించారు.

Updated Date - Jun 23 , 2024 | 03:34 AM