CBI: హైదరాబాద్కు వివేకా హత్య కేసు నిందితులు.. పోలీసు వాహనంలో రానన్న దేవిరెడ్డి

ABN , First Publish Date - 2023-02-09T18:21:55+05:30 IST

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు నిందితులు హైదరాబాద్కు బయలుదేరనున్నారు.

CBI: హైదరాబాద్కు వివేకా హత్య కేసు నిందితులు.. పోలీసు వాహనంలో రానన్న దేవిరెడ్డి

తొలిసారిగా తెలంగాణలోని న్యాయస్థానానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శంకరరెడ్డి, మరో ఇద్దరు..

కడప: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు నిందితులు హైదరాబాద్కు బయలుదేరనున్నారు. వివేకా హత్యకేసు (Viveka murder Case) నిందితులు మరికాసేపట్లో కడప సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారని జైలు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం10.30కు హైదరాబాద్ సీబీఐ కోర్టులో వివేకా హత్య కేసులు నిందితులు హాజరుకానున్నారు. కడప జైలులో ఏ2 సునీల్కుమార్, ఏ3 ఉమాశంకర్రెడ్డి, ఏ5 దేవిరెడ్డి శంకర్రెడ్డి (Devi Reddy Shankar Reddy) రిమాండు ఖైదీలుగా ఉన్నారు. బెయిల్పై బయట ఉన్న ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ4 అప్రూవర్ దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి రాత్రికి హైదరాబాద్కు వేర్వేరుగా చేరనున్నారు. కడప జైలులో మిలాఖత్కు వచ్చి శంకర్రెడ్డిని కుటుంబసభ్యులు కలిశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసు నిందితులు శుక్రవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరు కానున్నారు. కడప సెంట్రల్‌ జైల్లో రిమాండులో ఉన్న ముగ్గురు నిందితులను భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా పులివెందులలోని సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. విచారణ నత్తనడకన సాగుతుండడంతో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు విచారణను హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీచేసింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి, సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలకు సమన్లు జారీఅయ్యాయి. బెయిల్‌పై బయట ఉన్న ఎర్రగంగిరెడ్డికి, దస్తగిరికి సీబీఐ అధికారులు సమన్లు అందించారు. కడప సెంట్రల్‌ జైలులో ఉన్న సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలను గురువారం సాయంత్రం ప్రత్యేక బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలించనున్నారు.

ఒక్కొక్కరికి ఎస్‌ఐ స్థాయి అధికారితోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు చొప్పున మొత్తం 12 మంది భద్రత మధ్య హైదరాబాద్‌కు తరలించేందుకు పోలీసు అధికార యంతాంగ్రం ఏర్పాట్లు చేసింది. అవసరమైతే బందోబస్తు మరింత పెంచే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులంతా తొలిసారిగా హైదరాబాద్‌లో విచారణకు హాజరవుతుండటంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది. ఏ-5గా ఉన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి పోలీసు వాహనంలో కాకుండా సొంత వాహనంలోనే వెళ్తానని భీష్మించుక్కూర్చున్నట్లు సమాచారం. ఈ విషయం మీడియాకు తెలిస్తే తమ ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుందని పోలీసుసిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని తాడేపల్లి లేదా పులివెందుల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా హైదరాబాద్‌కు పంపిస్తారా లేక ప్రభుత్వ వాహనంలో తరలిస్తారా అన్నదానిపై జిల్లాలో ఆసక్తి నెలకొంది.

Updated Date - 2023-02-09T18:29:46+05:30 IST