Share News

MK Stalin: వీపీ సింగ్ విగ్రహావిష్కరణకు అఖిలేష్... స్టాలిన్ వ్యూహం ఇదేనా..

ABN , First Publish Date - 2023-11-27T15:20:54+05:30 IST

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ విగ్రహాన్ని సోమవారంనాడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

MK Stalin: వీపీ సింగ్ విగ్రహావిష్కరణకు అఖిలేష్... స్టాలిన్ వ్యూహం ఇదేనా..

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో దివంగత మాజీ ప్రధాన మంత్రి వీపీ సింగ్ (VP Singh) విగ్రహాన్ని సోమవారంనాడు ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అఖిలేష్‌తో పాటు దివంగత వీపీ సింగ్ కుటుంబ సభ్యులను ఈ కార్యక్రమానికి స్టాలిన్ ఆహ్వానించారు. అఖిలేష్ యాదవ్‌ను ముఖ్య అతిథిగా సీఎం ఆహ్వానించడం తాజాగా పలు రాజకీయ ఊహాగానాలకు తావిస్తోంది. జాతీయ రాజకీయాల్లో డీఎంకే మరింత కీలక భూమిక పోషించాలనే ఆలోచన దీని వెనుక ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


డీఎంకే ఇటీవల జాతీయ స్థాయి సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. ఇందులో 19 మంది విపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ప్రారంభించారు. విపక్ష 'ఇండియా' (INDIA) బ్లాక్‌ను బీజేపీ కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో దీనిని తిప్పికొట్టే వ్యూహంగా ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని సామాజిక న్యాయం పేరుతో తిప్పికొట్టేందుకు డీఎంకే వ్యూహరచన చేస్తోందని, ఇందులో భాగంగానే వీపీ సింగ్ విగ్రహావిష్కరణకు డీఎంకే జాతీయ స్థాయి సదస్సులో నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.


కాగా, అఖిలపక్ష నేతలందరినీ ఆహ్వానించడమనే గత సంప్రదాయానికి భిన్నంగా విగ్రహావిష్కరణకు అఖిలేష్ యాదవ్‌ను ప్రత్యేకించి తమిళనాడు సీఎం ఆహ్వానించడం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమవుతోంది. డీఎంకే పాన్ ఇండియా ఆకాంక్షలకు ఈ చర్య సూచిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఎంకే ఎంపీ టీఆర్ తంగబాలును ఢిల్లీలో కలుసుకుని ఆయన నుంచి వీపీ సింగ్ విగ్రహావిష్కరణకు హాజరుకావాలంటూ సీఎం ఇన్విటేషన్‌ను తీసుకున్నట్టు అఖిలేష్ యాదవ్ ఇంతకుముందు ఒక ట్వీట్ కూడా చేశారు.


డీఎంకే వెర్సస్ వీపీ సింగ్

దివంగత వీపీ సింగ్‌కు తమిళనాడులో చెక్కుచెదరని ఆదరణ ఉంది. సామాజిక న్యాయానికి వీపీ సింగ్ పోరాడారనే అభిప్రాయం ద్రవిడియన్‌ పార్టీల్లో బలంగా ఉంది. డీఎంకే, వీపీ సింగ్ మధ్య 1980, 1990 మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. వీపీ సింగ్ తన హయాంలో ఢిల్లీ రాజకీయాల్లో డీఎంకేను ప్రత్యేక గుర్తింపు కల్పించారు. ఈ క్రమంలోనే దివంగత వీపీ సింగ్ విగ్రహావిష్కరణకు ఆయన కుటుంబ సభ్యులను, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను సీఎం స్టాలిన్ ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లో తమ పరిధిని మరింత విస్తరించుకోవాలనే ఆలోచనతో డీఎంకే ఉందనే అభిప్రాయాన్ని ఈ చర్య తావిస్తోంది. అఖిలేష్‌ను ఆహ్వానించడం వెనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే విస్తృత వ్యూహాం ఉండవచ్చని అంటున్నారు. ఓబీసీ నేత అయన అఖిలేష్ యాదవ్ సైతం గతంలో సమాజ్‌వాది పార్టీని 'నార్త్ ఇండియా డీఎంకే'గా పోల్చారు.

Updated Date - 2023-11-27T15:20:56+05:30 IST