Manipur : ఇండియన్ రిజర్వు బెటాలియన్ శిబిరంపై 500 మంది దాడి.. భారీగా ఆయుధాలు, తూటాల దోపిడీ..

ABN , First Publish Date - 2023-08-04T10:49:14+05:30 IST

మణిపూర్‌లో కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సీనా వద్ద ఉన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ (IRB) శిబిరంపై దాదాపు 500 మంది దాడి చేశారు.

Manipur : ఇండియన్ రిజర్వు బెటాలియన్ శిబిరంపై 500 మంది దాడి.. భారీగా ఆయుధాలు, తూటాల దోపిడీ..
Paramilitary personnel

న్యూఢిల్లీ : మణిపూర్‌లో కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సీనా వద్ద ఉన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ (IRB) శిబిరంపై దాదాపు 500 మంది దాడి చేశారు. వీరిలో కొందరు 40 వాహనాల్లో వచ్చారు, మరికొందరు నడుస్తూ వచ్చారు. వీరు ఈ శిబిరంలోని తుపాకులు, తూటాలు, ఇతర మందుగుండు సామగ్రిని దోచుకుని పారిపోయారు. ఈ వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు.

మొయిరంగ్ పోలీస్ స్టేషన్లో 2వ ఐఆర్‌బీ బెటాలియన్ క్వార్టర్ మాస్టర్ ఓ ప్రేమానంద సింగ్ ఇచ్చిన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం, దుండగులు ఉదయం 9.45 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు. ఈ శిబిరం ప్రధాన ద్వారం వద్ద ఉన్న సెంట్రీపై దాడి చేశారు. రెండు తలుపులను బద్దలుకొట్టి, పెద్ద మొత్తంలో ఆయుధాలు, అజాల్ట్ రైఫిల్స్, పిస్తోళ్లు, మ్యాగజైన్లు, మోర్టార్లు, డిటొనేటర్లు, హ్యాండ్ గ్రెనేడ్లు, బాంబులు, కార్బైన్లు, తేలికపాటి తుపాకులు, దాదాపు 19 వేలకుపైగా తూటాలు, మందుగుండు సామగ్రిలను దోచుకెళ్లారు. భద్రతా సిబ్బంది ఈ దుండగులను చెదరగొట్టేందుకు 320 రౌండ్లు కాల్పులు జరిపారు. 20 బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.


సింగ్జమెయి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన మరొక దాడిలో పాల్గొన్న దుండగుల్లో మహిళలు కూడా ఉన్నారు. వీరు కాబో లెయికాయ్, ఖబీసోయి ప్రాంతాల్లోని మణిపూర్ రైఫిల్ బెటాలియన్‌పై దాడి చేయడానికి వచ్చారు. భద్రతా దళాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించి, వీరి ప్రయత్నాలను విఫలం చేశాయి.

కుకీ, మెయిటీ తెగల మధ్య ఘర్షణలు మే 3న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి మణిపూర్‌లో పోలీస్ స్టేషన్లు, సైనిక శిబిరాలపై దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దుండగులు దాదాపు 4,000 ఆయుధాలు, తుపాకులను, దాదాపు 5 లక్షల తూటాలను దోచుకెళ్లారు. జూలై ముగిసేనాటికి వీటిలో కేవలం 1,000 తుపాకులను మాత్రమే పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు.

ఈ ఘర్షణల్లో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. చురాచాంద్‌పూర్‌లో నిరాశ్రయులైన మెయిటీల ఇళ్లకు సమీపంలో 35 మంది కుకీల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని సోమవారం కుకీ సంఘాలు ప్రకటించాయి. దీనికి మెయిటీ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో అంత్యక్రియలను ఓ వారంపాటు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో బిష్ణుపూర్‌లో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, ఆయుధాల దోపిడీ జరగడం దారుణం.


ఇవి కూడా చదవండి :

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

Kedarnath yatra : కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడిన కొండచరియ.. శిథిలాల్లో 10 మంది చిక్కుకున్నట్లు ఆందోళన..

Updated Date - 2023-08-04T10:49:14+05:30 IST