Mann ki Baat : ముందే వచ్చిన ‘మన్ కీ బాత్’.. మోదీ ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2023-06-18T12:53:34+05:30 IST

మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిపర్‌‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

Mann ki Baat : ముందే వచ్చిన ‘మన్ కీ బాత్’.. మోదీ ఏం చెప్పారంటే..

న్యూఢిల్లీ : మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిపర్‌‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు. ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో మోదీ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమవుతూ ఉండేది. ఈ నెల 21 నుంచి ఆయన అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటించబోతున్నందువల్ల ఈ కార్యక్రమాన్ని ముందుగానే ప్రసారం చేశారు. మోదీ 102వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ముఖ్యాంశాలు..

- భారత దేశం గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకున్న విపత్తు నిర్వహణ సత్తా నేడు గొప్ప దృష్టాంతంగా మారిందని మోదీ చెప్పారు. బిపర్‌జోయ్ తుపాను వల్ల కచ్‌లో విధ్వంసం జరిగిందని, అయితే ప్రజలు దానిని పరిపూర్ణ ధైర్యసాహసాలు, సర్వసన్నద్ధతతో ఎదుర్కొన్నారని ప్రశంసించారు.

- లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

- వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని తెలిపారు. ఒక ప్రపంచం-ఒకే కుటుంబంగా అందరి సంక్షేమం కోసం యోగా అని తెలిపారు. యోగా స్ఫూర్తిని ఇది వ్యక్తం చేస్తుందన్నారు. ఇది అందరినీ అనుసంధానం చేసి, అందరూ తనను అనుసరించేలా చేస్తుందన్నారు.

- 2025నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని భారత దేశం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది క్షయ రోగులను దత్తత తీసుకుంటున్నారని తెలిపారు. ఇది భారత దేశ వాస్తవ బలమని చెప్పారు.

- ఉత్తర ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో అంతరించిపోయిన నదిని ప్రజలు పునరుద్ధరించారని తెలిపారు. ఈ నది మూలాధారాన్ని అమృత్ సరోవర్‌గా తీర్చిదిద్దారన్నారు.

- మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్రపతి శివాజీ మహారాజు పరిపాలనను పరిశీలించాలని చెప్పారు. ఆయన నుంచి ధైర్యసాహసాలతోపాటు ఆయన పరిపాలన నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందన్నారు. ఆయన మేనేజ్‌మెంట్ స్కిల్స్, మరీ ముఖ్యంగా నీటి యాజమాన్యం, నావికా దళం నైపుణ్యాలు ఇప్పటికీ భారత దేశానికి గర్వకారణమని వివరించారు.

- నిస్సారమైన చౌడు భూములను సారవంతంగా, పచ్చదనంతో నిండిపోయేలా చేయాలంటే జపాన్‌లోని మియావాకీ అనే విధానం చాలా బాగుంటుందని తెలిపారు. ఈ టెక్నిక్‌ను క్రమంగా భారత దేశంలో కూడా అనుసరిస్తున్నారని తెలిపారు. కేరళలో టీచర్ రాఫి రామ్‌నాథ్ ఈ విధానాన్ని ఉపయోగించి 115 రకాల మొక్కలతో విద్యావనం పేరుతో ఓ చిన్న అడవిని సృష్టించారన్నారు. ఈ చిట్కాను ఉపయోగించాలని దేశవాసులందరినీ కోరుతున్నానని చెప్పారు.

- భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని చెప్పారు. మన ప్రజాస్వామిక సిద్ధాంతాలు అత్యున్నతమైనవని, మన రాజ్యాంగం సర్వోత్కృష్టమైనదని చెప్పారు. అందువల్ల జూన్ 25ను ఎన్నటికీ మర్చిపోబోమన్నారు. మన దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించిన రోజు జూన్ 25 అని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..

Updated Date - 2023-06-18T13:24:11+05:30 IST