CoWIN : కోవిన్‌ను దెబ్బతీయాలని ప్రపంచంలో చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2023-06-13T12:03:08+05:30 IST

కోవిడ్ టీకాల కోసం నమోదు చేయించుకోవడానికి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిన్ (CoWIN) పోర్టల్‌ను దెబ్బతీసేందుకు ప్రపంచంలో చాలా శక్తులు పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.

CoWIN : కోవిన్‌ను దెబ్బతీయాలని ప్రపంచంలో చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి : కేంద్ర మంత్రి
Rajeev Chandrasekhar

న్యూఢిల్లీ : కోవిడ్ టీకాల కోసం నమోదు చేయించుకోవడానికి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిన్ (CoWIN) పోర్టల్‌ను దెబ్బతీసేందుకు ప్రపంచంలో చాలా శక్తులు పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) చెప్పారు. మెసేజింగ్ యాప్‌ టెలిగ్రామ్‌లో వచ్చిన భారతీయుల వివరాలు కోవిన్ ద్వారా అక్రమంగా బయటకు వచ్చినవి కాదన్నారు. కోవిడ్-19 నుంచి కాపాడుకోవటం కోసం టీకాలు వేయించుకున్నవారి వివరాలు కోవిన్ యాప్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే.

కోవిన్ డేటా లీక్ అయిందని సోమవారం వార్తలు వచ్చాయి. అత్యున్నత స్థాయి రాజకీయ నేతలతోపాటు భారతీయుల వివరాలు బయటకు పొక్కినట్లు, ఆధార్ , పాన్ వివరాలు లీక్ అయినట్లు, ఈ లీక్ అయిన డేటా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం టెలిగ్రామ్‌లో అందరికీ అందుబాటులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మంగళవారం మాట్లాడుతూ, కోవిన్ యాప్ నుంచి భారతీయుల వివరాలు బయటకు పొక్కలేదని చెప్పారు. మన దేశ నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్‌టీ-ఇన్ (CERT-In) ఈ డేటా లీక్‌ వార్తలపై సమీక్ష జరిపిందని చెప్పారు. లీక్ అయిందని చెప్తున్న డేటా బూటకం కావచ్చునని లేదా వేరొక థర్డ్ పార్టీ సోర్స్ నుంచి సేకరించినది అయి ఉంటుందని చెప్పారు. వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించిన ప్రభుత్వ పోర్టల్‌ను దెబ్బతీయాలని ప్రపంచంలోని చాలా శక్తులు కోరుకుంటున్నాయన్నారు. సోమవారం వచ్చిన వార్తలు కోవిన్ యాప్‌ను దెబ్బతీయాలని లక్ష్యంగా పెట్టుకున్నవారు చేస్తున్న ప్రయత్నాలకు మరొక ఉదాహరణ అని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనలపై దర్యాప్తు చేయవలసిన సంస్థ ఈ అంశంపై దర్యాప్తు చేస్తోందన్నారు. టెలిగ్రామ్ బాట్ సోమవారం వెల్లడించిన భారతీయుల వివరాలు కోవిన్ యాప్ నుంచి పొందినవి కాదని ఈ సంస్థ సోమవారమే ప్రకటించిందని చెప్పారు. టెలిగ్రామ్ బాట్‌లో వెల్లడించిన వివరాలు బూటకం అయినా అయి ఉండాలని, లేదంటే, థర్డ్ పార్టీ థ్రెట్ యాక్టర్ నుంచి సేకరించినవి అయినా అయి ఉండాలని చెప్పారు.

ప్రతిపక్షాల ఆగ్రహం

ఈ డేటా బ్రీచ్ ఆరోపణలపై ప్రతిపక్షాలు సోమవారం తీవ్రంగా స్పందించాయి. కోవిన్ యాప్ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇది నేరపూరిత నిర్లక్ష్యమని కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం డేటా పరిరక్షణ చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. డిజిటల్ ఇండియాగా మార్చాలనే ఆత్రుతతో ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత గోప్యత గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

అయితే కోవిన్ పోర్టల్‌ నుంచి డేటా లీక్ అయినట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ద్వారా మాత్రమే డేటా అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. కోవిన్ పోర్టల్‌లోని డేటాను భద్రంగా కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి :

AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?

Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి

Updated Date - 2023-06-13T12:03:08+05:30 IST