Chandrayaan-3: చందమామతో ఒక మాట చెప్పాలి

ABN , First Publish Date - 2023-08-23T02:27:35+05:30 IST

చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

Chandrayaan-3: చందమామతో ఒక మాట చెప్పాలి

నేడే చంద్రుడిపై దిగనున్న విక్రమ్‌ ల్యాండర్‌..

సమయం సాయంత్రం 6:04

క్లైమాక్స్‌కు 41 రోజుల జర్నీ.. సర్వత్రా ఉత్కంఠ

సాయంత్రం 5:20 నుంచి ప్రత్యక్ష ప్రసారం

విజయవంతమైతే చరిత్ర సృష్టించనున్న ఇస్రో

ఇప్పటిదాకా 12దేశాల నుంచి 141యత్నాలు

సాఫ్ట్‌ ల్యాండింగ్‌.. ఎంత క్లిష్టమో!

చంద్రయాన్‌-3లో అతి కీలకమైన దశ అదే

‘20 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌’ అంటున్న శాస్త్రజ్ఞులు

సూళ్లూరుపేట, బెంగళూరు, ఆగస్టు 22: చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్‌ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన విక్రమ్‌ ల్యాండర్‌(Vikram Lander) మాడ్యూల్‌ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో(ISRO) అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్‌ మిషన్‌ విజయవంతమైతే అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డు సృష్టించనుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

నాలుగేళ్ల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 (Chandrayaan-2)లోని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై దిగే క్రమంలో చివరి నిమిషంలో కుప్పకూలింది. దానికితోడు చంద్రుని దక్షిణ ధ్రువంపై దించేందుకు ఇటీవల రష్యా చేపట్టిన లూనా-25 కూడా ఈ నెల 19న జాబిల్లిపై క్రాష్‌ ల్యాండ్‌ అయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న ల్యాండర్‌ మాడ్యూల్‌ను నిరంతరం పరిశీలిస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్‌ను దింపేందుకు చంద్రుడిపై సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు. సూర్యుడి వెలుగు రాగానే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 5:45 గంటలకు ఈ ప్రక్రియ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి సమయాన్ని ‘20 నిమిషాల టెర్రర్‌’గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఇదంతా ల్యాండర్‌ స్వయంగా చేసుకోవాల్సిన ప్రక్రియ. ముందుగా సురక్షిత ల్యాండింగ్‌ కోసం సరైన ప్రదేశాన్ని అది ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సరైన ఎత్తులో పయనిస్తూ దానిలో ఉన్న ఇంజన్లను సరైన సమయంలో మండిస్తూ చంద్రుడి దిశగా సాగాలి.

ల్యాండర్‌ మాడ్యూల్‌ పనితీరుని తనిఖీ చేసి, దాన్ని ఎక్కడ దించాలో నిర్ధారించుకున్న తర్వాత బెంగళూరులోని ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ నుంచి ఇస్రో సంబంధిత కమాండ్లను ల్యాండర్‌ మాడ్యూల్‌కు అప్‌లోడ్‌ చేస్తుంది. నిర్దేశిత ల్యాండింగ్‌ షెడ్యూల్‌కు 2 గంటల ముందు ఈ ప్రక్రియ చేపడుతుంది. ల్యాండర్‌ జాబిల్లిపై దిగిన తర్వాత దాని సైడ్‌ ప్యానెల్‌ తెరుచుకుని ర్యాంపులా కిందకు వాలుతుంది. లోపల ఉన్న రోవర్‌ ఆ ర్యాంప్‌ పైనుంచి చంద్రుని ఉపరితలంపై దిగి పరిశోధనలు చేస్తుంది. ల్యాండర్‌, రోవర్‌ ఒక లూనార్‌ డే (అంటే భూమిపై 14 రోజులు) పాటు చంద్రునిపై పరిశోధనలు చేస్తాయని ఇస్రో వెల్లడించింది. జాబిల్లి ఉపరితలంపై ప్రయోగాలు చేసేందుకు వీలుగా ల్యాండర్‌, రోవర్‌లో శాస్త్రీయ పేలోడ్లను ఇస్రో ఏర్పాటు చేసింది. లూనార్‌ డేలో సూర్యకాంతి ఉన్నంతవరకు వీటిలోని వ్యవస్థలు సజావుగా పనిచేస్తాయి. సూర్యుడు అస్తమించిన తర్వాత అంతా చీకటిగా మారడంతోపాటు ఉష్ణోగ్రతలు మైనస్‌ 180 డిగ్రీల వరకు పడిపోతాయి. దీంతో అందులోని వ్యవస్థలు పనిచేసే అవకాశం దాదాపు సాధ్యం కాదని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ చెప్పారు. కాగా, చంద్రుని ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పీడీసీ) ఈ నెల 19న తీసిన చంద్రుని ఫొటోలను ఇస్రో మంగళవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ల్యాండర్‌ దిగేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయడంలో ఈ చిత్రాలు ఉపయోగపడతాయని తెలిపింది.

అనుకూలించకపోతే 27కి వాయిదా!

ల్యాండర్‌ మాడ్యూల్‌ పారామీటర్ల పనితీరు ‘అసాధారణం’గా ఉందని తేలితే ల్యాండింగ్‌ ప్రక్రియను ఈ నెల 27కు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌(Nilesh Desai) తెలిపారు. మంగళవారం ఆయన అహ్మదాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రుడి ఉపరితలంపై 30కి.మీ. ఎత్తు నుంచి సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో ల్యాండర్‌ దిగేందుకు ప్రయత్నిస్తుంది. వేగాన్ని నియంత్రించలేకపోతే క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యే అవకాశాలుంటాయి. ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం కావడానికి 2 గంటల ముందు కమాండ్లను అప్‌లోడ్‌ చేస్తాం. టెలిమెట్రీ సిగ్నల్స్‌ను విశ్లేషించి చంద్రుడి స్థితిగతులను పరిశీలిస్తాం. ఆ సమయంలో ల్యాండర్‌ మాడ్యూల్‌ పారామీటర్ల పనితీరుకు సంబంధించిన ఏదైనా అసాధారణంగా కనిపిస్తే ల్యాండింగ్‌ను 27కు వాయిదా వేస్తాం’’ అని ఆయన వివరించారు. ఒకవేళ ఈ మిషన్‌ తేదీ మారితే ప్రధాన ల్యాండింగ్‌ ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో మరో స్థలాన్ని ఎంపిక చేసినట్లు దేశాయ్‌ పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) పాల్గొనే అవకాశం ఉంది. బిక్స్‌ శిఖరాగ్ర సదస్సు(Bix Summit) కోసం ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం సాయంత్రం బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో జరిగే కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


దక్షిణ ధ్రువమే ఎందుకంటే..!

ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అక్కడ నీటి జాడలు ఉన్నట్టు భావిస్తుండడమే. ఆ ప్రాంతంలో మంచు స్ఫటికాల రూపంలో నీటి నిల్వలున్నాయని నాసా కూడా గుర్తించింది. దక్షిణ ధ్రువంపై గురుత్వాకర్షణ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ వెలుతురు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మైన్‌సలో ఉంటాయి. కాబట్టి అక్కడ నీరు ఉండే అవకాశం ఉంటుంది. ఇస్రో అంచనా ప్రకారం అక్కడ పది కోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్న చోట మనిషి నివసించగలడు. కాబట్టి భవిష్యత్తులో చంద్రునిపై పరిశోధలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక్కడ రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి. దీంతో ల్యాండర్‌ దిగడానికి కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది.

ఇస్రో వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం

చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఇస్రో నిర్ణయించింది. బుధవారం సాయంత్రం 5:20గంటల నుంచి ఇస్రో వెబ్‌సైట్‌, ఫేస్‌బుక్‌ పేజ్‌, యూట్యూబ్‌ చానెల్‌తోపాటు డీడీ నేషనల్‌ చానెల్‌లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

చంద్రయాన్‌-2.. ఇలా విఫలం!

చివరి దశలో సరిగ్గా పనిచేయని వ్యవస్థలు

చంద్రయాన్‌-2లో విక్రమ్‌ ల్యాండర్‌ ఈ దశలోనే చివరి క్షణాల్లో విఫలమైంది. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? అనే ప్రశ్నకు ఇస్రో చీఫ్‌ ఎస్‌.సోమనాథ్‌ గతంలో ఒకసారి వివరణ ఇచ్చారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం...

దాదాపు పదకొండున్నర నిమిషాలపాటు సాగే రఫ్‌ బ్రేకింగ్‌ దశ.. 10 సెకన్లపాటు ఉండే ఆల్టిట్యూడ్‌ హోల్డింగ్‌ ఫేజ్‌ల్లో జరిగిన పొరపాట్లే విక్రమ్‌ వైఫల్యానికి కారణం. తొలుత రఫ్‌ బ్రేకింగ్‌ దశలో విక్రమ్‌ వేగాన్ని తగ్గించడానికి దాంట్లోని ఐదు థ్రస్టర్లు మండడం ప్రారంభించాయి. అయితే.. అవి 10 శాతం అధిక పీడనాన్ని ఇవ్వడం వల్ల ల్యాండర్‌ వేగం తగ్గింది. ఆ సమస్య అలా ఉండగానే.. ఆల్టిట్యూడ్‌ హోల్డింగ్‌ ఫేజ్‌ దశ మొదలైంది. ల్యాండర్‌లోని సాఫ్ట్‌వేర్‌ దాన్ని నిర్ణీత షెడ్యూలు ప్రకారం 50 డిగ్రీల వంపు తిరిగేలా చేసింది.

ఆ తర్వాత ఫైన్‌ బ్రేకింగ్‌ దశ మొదలైంది. కానీ, మొదటి రెండు దశలు ముగిసేసరికే ల్యాండర్‌ హారిజాంటల్‌, వర్టికల్‌ వేగాలు నిర్ణీత స్థాయులకు భిన్నంగా మారిపోయాయి. ఆ సమయానికి ల్యాండర్‌ ల్యాండింగ్‌ ప్రదేశానికి 4.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దానికి అప్పటికి ఉన్న వేగంతో అంతదూరం చేరుకోవడం చాలా కష్టం. దీన్ని గుర్తించిన గైడెన్స్‌ వ్యవస్థ ల్యాండర్‌ దిశను మార్చే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నంలో విఫలమైంది. ల్యాండర్‌ వర్టికల్‌ వేగం బాగా పెరిగిపోయింది. దాన్ని నియంత్రిస్తూ ల్యాండింగ్‌ సైట్‌కు చేరాలంటే.. దాని హారిజాంటల్‌ వేగం పెరగాల్సి ఉంది. ల్యాండర్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఆ దిశగా ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. పెరిగిన వర్టికల్‌ వేగంతో.. ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా తాకింది.

Updated Date - 2023-08-23T03:58:27+05:30 IST