NRI: మెక్సికోలో దారుణ ఘటన.. డబ్బుల కోసం ఎన్నారైను అతి కిరాతకంగా నడిరోడ్డుపై..!

ABN , First Publish Date - 2023-08-22T11:51:55+05:30 IST

మెక్సికో సిటీలో (Mexico City) అత్యంత దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం ఓ భారత సంతతి వ్యక్తిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపారు.

NRI: మెక్సికోలో దారుణ ఘటన.. డబ్బుల కోసం ఎన్నారైను అతి కిరాతకంగా నడిరోడ్డుపై..!

ఎన్నారై డెస్క్: మెక్సికో సిటీలో (Mexico City) అత్యంత దారుణ ఘటన జరిగింది. డబ్బుల కోసం ఓ భారత సంతతి వ్యక్తిని కొందరు దుండగులు అతి కిరాతకంగా నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపారు. మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్తున్న ఎన్నారై (NRI) ను నలుగురు దుండగులు ఇలా అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. కాగా, ఎన్నారై మెక్సికో సిటీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 10వేల డాలర్లు మార్చుకుని కారులో ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో మెక్సికోలో ఉంటున్న భారతీయ సమాజం (Indian Community) ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

వివరాల్లోకి వెళ్తే.. డబ్బులు మార్చుకుని కారులో వస్తున్న భారతీయ వ్యక్తి (Indian Origin) ని మోటార్‌సైకిళ్లపై నలుగురు దుండగులు వెంబడించారు. డబ్బు డిమాండ్ చేస్తూ కారును ఆపాలని వారు బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న ఎన్నారై అందుకు నిరాకరించాడు. వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కారు ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లాడు. దుండగుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో దుండగులలో ఒకరు ఉన్నట్టుండి కాల్పులకు పాల్పడ్డాడు. ఆ కాల్పులలో కారు డ్రైవ్ చేస్తున్న భారతీయుడు (Indian) మృతి చెందాడు. అతడితో పాటు కారులో ఉన్న మరో వ్యక్తికి ఏమీ కాలేదు. మెక్సికో నగరం పరిధిలోని వయాడక్టో ప్రాంతంలో (Viaducto Area) ఈ షాకింగ్ సంఘటన జరిగింది. కాగా, పౌరుల రక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని అక్కడి ప్రజలు ఎప్పటినుంచో చెబుతున్నారు.

Prohibited Items: దుబాయ్ వెళ్తున్నారా? అయితే అక్కడికి తీసుకెళ్లకూడని ఈ వస్తువుల జాబితాపై ఓ లుక్కేయండి..!


మెక్సికోలోని భారత రాయబార కార్యాలయం తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా భారత పౌరుడి మరణాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటనపై ఎంబసీ విచారం వ్యక్తం చేసింది. "మెక్సికోలో నివసిస్తున్న భారత పౌరుడు దురదృష్టకర, హృదయ విదారకమైన సంఘటనలో తన ప్రాణాలను కోల్పోయాడు. నేరస్థులను త్వరగా పట్టుకోవాలని మేము మెక్సికన్ అధికారులను కోరుతున్నాము" అని తన ట్వీట్‌లో పేర్కొంది. ఈ ఘటన మెక్సికోలోని భారతీయ పౌరుల భద్రతపై కూడా ఆందోళన కలిగిస్తోందని ఈ సందర్భంగా రాయబార కార్యాలయం పేర్కొంది. మెక్సికో సిటీలో 8వేల మంది భారతీయులు నివసిస్తున్నారని, వారిలో చాలా మంది ఐటీ (IT), తయారీ రంగాలలో పనిచేస్తున్నారని ఎంబసీ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణించడం, ప్రమాదకర ప్రాంతాల గురించి తెలుసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

Kuwait: స్వదేశానికి వచ్చే ప్రవాసులు జర జాగ్రత్త.. 24 గంటల వ్యవధిలో 70 మందిపై ట్రావెల్ బ్యాన్..!

Updated Date - 2023-08-22T11:52:21+05:30 IST