Share News

AP Politics: దొంగ ఓట్లపై రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ABN , First Publish Date - 2023-11-27T19:11:28+05:30 IST

Andhra Pradesh: ఏపీలోని అధికార వైసీపీ పార్టీ విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

AP Politics: దొంగ ఓట్లపై రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ

ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఏపీలో దొంగ ఓట్ల నమోదు.. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్‌ వ్యవస్థ మాటున ఎన్నికలను ప్రభావితం చేసే కుట్ర జరుగుతోందని, వారి ద్వారా చట్ట విరుద్ధంగా వ్యక్తిగత సమాచారం సేకరణ చేస్తున్నారని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. ఎన్నికల్లో అక్రమాలకు తావిస్తున్న వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ.. తమ పార్టీ కార్యకర్తలనే ప్రభుత్వం వాలంటీర్లుగా నియమించిందని, అందుకు అవకాశం కల్పించిన జీవో నెం.104ను సస్పెండ్‌ చేయకపోతే ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ప్రాథమిక, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అధికార వైసీపీ తన కార్యకర్తలను వాలంటీర్లుగా చేర్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, వారి ద్వారా సేకరించిన సమాచారాన్నంతా అధికారికంగా సొంత పార్టీ సభ్యులకు అందించి వారి ద్వారా గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని సదరు సంస్థ తన పిటిషన్‌లో ఆరోపించింది. కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతలను విస్మరించడంతో ఏపీలో పెద్దఎత్తున ఓటర్ల తొలగింపు జరిగిందని తెలిపింది.

ఎన్నికలను ప్రభావితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అవలంభిస్తోందని.. ఓట్ల తొలగింపు, డేటా సేకరణ, సేకరించిన డేటాను ప్రైవేటు సంస్థలకు పంచేందుకు అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని పిటిషన్‌లో సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వివరించింది. వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఐప్యాక్, రామ్‌ ఇన్ఫో ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాంటి సంస్థల ద్వారా ప్రొఫైలింగ్‌ చేయించడంపై పరిశీలన కోసం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ కోరింది. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించాలని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ సర్వోన్నత న్యాయస్థానాన్ని వేడుకుంది. రాజ్యాంగంలోని 21, 243కి అధికరణానికి విరుద్ధమైన జీవో నం. 104ను కొట్టేయాలని, చట్టవిరుద్ధంగా నియమితులై అధికార పార్టీ తరుఫున పని చేస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల సంబంధ విధుల నుంచి పూర్తిగా తప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సేవలను ఉపయోగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-27T19:11:29+05:30 IST