IND vs WI 5th T20: తిలక్, శాంసన్ ఖాతాలో రికార్డులు.. సూర్య చెలరేగిన విండీస్ ముందు మోస్తరు లక్ష్యం!

ABN , First Publish Date - 2023-08-13T22:32:02+05:30 IST

కీలకమైన ఐదో టీ20లో భారత బ్యాటర్ల తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(61) మినహా ఇతర బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.

IND vs WI 5th T20: తిలక్, శాంసన్ ఖాతాలో రికార్డులు.. సూర్య చెలరేగిన విండీస్ ముందు మోస్తరు లక్ష్యం!

ఫ్లోరిడా: కీలకమైన ఐదో టీ20లో భారత బ్యాటర్ల తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(61) మినహా ఇతర బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది. రొమారియో షెపర్డ్(4/31), అకేల్ హోసేన్(2/24), హోల్డర్(36/2) టీమిండియాను కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. విండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ దెబ్బకు 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్(5), శుభ్‌మన్ గిల్(9) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నిజానికి గిల్‌కు హోసేన్ వేసిన బంతి లెగ్ బైస్‌లో స్టంప్స్ మిస్సయింది. కానీ గిల్ రివ్యూకు వెళ్లకపోవడం టీమిండియాకు మైనస్‌గా మారింది. ఈ సమయంలో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకున్నారు.


వీరిద్దరు మూడో వికెట్‌కు 30 బంతుల్లో 49 పరుగులు జోడించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అయితే ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ పాట్నర్‌షిప్‌ను 8వ ఓవర్‌లో స్పిన్నర్ రోస్టన్ చేజ్ విడదీశాడు. తిలక్ వర్మ(27) నేరుగా చేజ్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ 173 పరుగులు చేశాడు. దీంతో టీ20 కెరీర్ మొదటి 5 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా తిలక్ వర్మ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో దీపక్ హుడా(172)ను అధిగమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 6 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా సంజూ శాంసన్ రికార్డు నెలకొల్పాడు. ఇందుకు శాంసన్ 246 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత శాంసన్(13), హార్దిక్ పాండ్యాను(14) పేసర్ రొమారియో షెపర్డ్ స్వల్ప స్కోర్లకే ఔట్ చేశాడు. దీంతో 130 పరుగులకు టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. అయితే ఒక వైపు వికెట్లు పడుతున్నప్పటికీ మిస్టరీ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరిపోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ20 కెరీర్‌లో సూర్యకు ఇది 15వ హాఫ్ సెంచరీ.

అయితే 16వ ఓవర్ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ తిరిగి ప్రారంభమైంది. 4 ఫోర్లు, 3 సిక్సులతో 45 బంతుల్లో 61 పరుగులు చేసిన సూర్య.. హోల్డర్ బౌలింగ్‌లో లెగ్ బైస్ రూపంలో ఔటయ్యాడు. చివరలో అక్షర్ పటేల్ 13 పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 150 పరుగుల మార్కు దాటింది. అలాగే అక్షర్, అర్ష్‌దీప్ చెరో సిక్సు బాదారు. అయితే మరోసారి వర్షం రావడంతో టీమిండియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. చివరి 5 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. విండీస్ పేసర్లు షెపర్డ్, హోల్డర్ కట్టడి చేయడంతో డెత్ ఓవర్లలో భారత జట్టు పెదగా పరుగులు రాబట్టలేకపోయింది. విండీస్ బౌలర్లలో షెపర్డ్ 4 వికెట్లతో చెలరేగాడు. హోల్డర్, హోసేన్ రెండేసి వికెట్లు, చేజ్ ఒక వికెట్ తీశారు.

Updated Date - 2023-08-13T22:32:02+05:30 IST