Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన అమ్మాయిలు

ABN , First Publish Date - 2023-09-25T15:24:44+05:30 IST

ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం గెలిచారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 19 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురువేశారు.

Asian Games 2023: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన అమ్మాయిలు

చైనా: ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. క్రికెట్ పోటీల్లో భారత అమ్మాయిలు బంగారు పతకం గెలిచారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు 19 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురువేశారు. దీంతో బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఎడిషన్‌లోనే మన అమ్మాయిలు గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఫైనల్‌లో భారత్ ఉమెన్స్, శ్రీలంక ఉమెన్స్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో మన అమ్మాయిలు అద్భుతంగా ఆడారు. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన(46), జెమిమా రోడ్రిగ్స్(42) రాణించగా.. టిటాస్ సాధు అద్భుత బౌలింగ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. 18 ఏళ్ల ఈ మీడియం పేసర్ 6 పరుగులు మాత్రమే ఇచ్చి శ్రీలంక టాప్ 3 వికెట్లను తీసింది. దీంతో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకను టీమిండియా వరుసగా రెండు ఫైనల్స్‌లో ఓడించింది.


టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. పిచ్ స్లోగా ఉండడంతో పరుగులు రావడం కష్టమైపోయింది. 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 బంతుల్లో 46 పరుగులు చేసిన స్మృతి మంధాన, 5 ఫోర్లతో 40 బంతుల్లో 42 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. షఫాలీ వర్మ 9, రిచా ఘోష్ 9, హర్మన్ ప్రీత్ కౌర్ 2, పూజా వస్త్రాకర్ 2 పరుగులు చేశారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో హాసిని పెరీరా 25, నీలాక్షి డి సిల్వా 23, ఓషది రణసింగ్ 19, చమరి అతపత్తు 12 పరుగులు చేశారు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో టిటాస్ సాధు 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసింది. రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య తలో వికెట్ తీశారు. కాగా ఈ నెల 17న ముగిసిన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను భారత పురుషుల జట్టు చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏషియన్ గేమ్స్‌ ఫైనల్‌లో మహిళల విభాగంలో మరోసారి టీమిండియా చేతిలో శ్రీలంకకు ఓటమి ఎదురైంది. దీంతో వారం రోజుల వ్యవధిలో శ్రీలంకను వరుసగా రెండు ఫైనల్స్‌లో ఓడించిన టీమిండిగా ట్రోఫిని ఎగురేసుకుపోయింది. కాగా నేడు ఉదయమే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత పురుషుల జట్టు స్వర్ణ పతకం గెలిచింది. దీంతో భారత్ ఖాతాలో స్వర్ణ పతకాల సంఖ్య 2కు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 11కి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, 3 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి.

Updated Date - 2023-09-25T15:30:11+05:30 IST