LB Nagar Murder Case: ఉన్మాది కాళ్ల మీద పడి ఆమె అలా అడిగిన కూడా..!

ABN , First Publish Date - 2023-09-05T04:11:53+05:30 IST

ప్రేమోన్మాది శివ కుమార్‌ చేతిలో తీవ్ర గాయాలపాలైన వైద్య విద్యార్థిని సంఘవి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు దిగ్ర్భాంతికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, అయితే భవిష్యత్తులో ఆమె, ఉన్నచోటు నుంచి కదల్లేకపోవచ్చునని, మంచానికే

LB Nagar Murder Case: ఉన్మాది కాళ్ల మీద పడి ఆమె అలా అడిగిన కూడా..!

సంఘవికి ప్రాణాపాయం లేదు.. కానీ ఇక లేచి నడవకపోవచ్చు

వెన్ను, గర్భాశయం వద్ద తీవ్రగాయాలు.. దెబ్బతిన్న నరాలు

పెళ్లి చేసుకుంటానని కాళ్లమీద పడ్డా కనికరించని ఉన్మాది

పెళ్లికి సంఘవిని ఒప్పించేందుకు ఆమె ఇంటికి వెళ్లి ఘాతుకం

శివను ఎన్‌కౌంటర్ చేయండి.. అప్పుడే మాకు న్యాయం

పృథ్వీ మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా, రాస్తారోకో

మావోడిని ఉరితీయండి!.. శివ తల్లి డిమాండ్

నాలుగేళ్ల క్రితం తండ్రిని హత్య చేసిన ఉన్మాది

హైదరాబాద్‌ సిటీ, కొత్తపేట, కొందుర్గు, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రేమోన్మాది శివ కుమార్‌ చేతిలో తీవ్ర గాయాలపాలైన వైద్య విద్యార్థిని సంఘవి (Sanghavi) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు దిగ్ర్భాంతికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆమెకు ప్రాణాపాయం లేదని, అయితే భవిష్యత్తులో ఆమె, ఉన్నచోటు నుంచి కదల్లేకపోవచ్చునని, మంచానికే పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘవి వెన్ను, గర్భాశయం వద్ద గాయాలయ్యాయని.. ఫలితంగా ఆమె మున్ముందు లేచి నడవలేకపోవచ్చునని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌, చీఫ్‌ గ్యాస్ట్రో ఎంటారాలజిస్టు డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ఆమెకయ్యే వైద్య ఖర్చులన్నీ భరించి, మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తుందని చెప్పారు. ఈ మేరకు సంఘవి ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి సొమవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. సంఘవిని ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ట్రామా కేర్‌ బృందం న్యూరో సర్జన్లు, ఆర్థోపెడిక్స్‌, ఎమర్జెన్సీ ఫిజిషియన్ల ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. యువతి ముఖంపై చాలా కత్తిపోట్లు ఉన్నాయని, ప్లాస్టిక్‌ సర్జన్‌ ముఖానికి కుట్లు వేసి సరిచేశారని చెప్పారు. ప్రధానంగా గర్భాశయ, వెన్నుపూస ప్రాంతాల్లో ప్రధాన నరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని చెప్పారు. సంఘవికి ఇంకా కొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని వెల్లడించారు. సంఘవిని ఆస్పత్రి నుంచి ఇంటికి పంపాక కూడా తమ బృందం ఆమెకు అవసరమైన వైద్య సాయం చేస్తుందని పేర్కొన్నారు.

శివ కుమార్‌ను ఎన్‌కౌంటర్‌ చేయాలి

దాడితో సంఘవిని తీవ్రంగా గాయపరిచి.. ఆమె సోదరుడు పృథ్వీతేజను హత్య చేసిన ఉన్మాది శివ కుమార్‌ను (Shiva Kumar) ఎన్‌కౌంటర్‌ చేయాలని, లేదంటే ఉరి తీయాలని అప్పుడే తమకు న్యాయం చేసినట్లవుతుందని బాధిత కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పృధ్వీ మృతదేహంతో బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కొందుర్గులో రాస్తారోకో చేశారు. వివిధ పార్టీల నేతలు కూడా ధర్నాలో పాల్గొన్నారు. హోం మంత్రి వచ్చేదాకా రాస్తారోకో విరమించేది లేదని భీష్మించారు. రాస్తారోకోతో షాద్‌నగర్‌, పరిగి రోడ్లపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. చివరకు పృథ్వీ బాబాయితో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ ఫోన్లో మాట్లాడటంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ఎమ్మెల్యే కొందుర్గుకు వచ్చి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తొలుత పిన్ని కూతురుతో.. తర్వాత ఒంటరిగా వచ్చి..

బాల్య స్నేహితురాలైన సంఘవిని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలనే పట్టుదలతో ఆమె ఇంటికి వచ్చి శివకుమార్‌ ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు విచారణను ఎల్బీనగర్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఫరూక్‌నగర్‌ మండలం నేరెళ్ల ప్రాంతానికి చెందిన శికుమార్‌(26), కొందుర్గు మండలానికి చెందిన సంఘవి పదోతరగతి దాకా కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత శివకుమార్‌ రామాంతపూర్‌లో ఉంటూ ఆర్టిస్టుగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంఘవి రామాంతపూర్‌లోని ఓ కళాశాలలో హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకోవడంతో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం సంఘవి ఇంట్లో తెలియడంతో వారు ఆమెను, అతడిని మందలించారు. పెద్దవాళ్లకు ఇష్టం లేకపోవడంతో కొద్దిరోజులుగా సంఘవి శివ కుమార్‌ను దూరం పెట్టి, మాట్లాడటం మానేసినట్లు తెలిసింది. అయితే ఎలాగైనా తనతో పెళ్లికి సంఘవిని ఒప్పించాలని, ఇందుకు ఆమెతో మాట్లాడాలని శివ అనుకున్నాడు. ఎన్ని సార్లు కాల్స్‌ చేసినా సంఘవి జవాబివ్వకపోవడంతో ఆదివారం 11 గంటలకు శివ తన పిన్ని కూతురుతో కలిసి ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికొచ్చాడు. పెళ్లికి సంఘవిని ఒప్పించే ప్రయత్నం చేశాడు. పెద్దలకు ఇష్టం లేదని, అందుకే పెళ్లి చేసుకోవడం కుదరదని సంఘవి చెప్పడంతో పిన్ని కూతురుతో కలిసి వెళ్లిపోయాడు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు సంఘవి ఇంటికి మళ్లీ వచ్చాడు. అప్పుడు ఇంట్లో సంఘవి ఆమె తమ్ముడు పృథ్వీ మాత్రమే ఉన్నారు. మరో సోదరుడు రోహిత్‌, బంధువుల ఊరికి వెళ్లాడు. శివకుమార్‌ ఇంట్లోకి వచ్చినప్పుడు హాల్‌లో కూర్చున్న పృథ్వీ ఫోన్‌లో పబ్జీ ఆడుతున్నాడు. సంఘవిని తీసుకొని బెడ్‌రూంలోకి వెళ్లిన శివ ఆమెతో పెళ్లి విషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. కొద్దిసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ‘‘నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకో లేదంటే చచ్చిపోతా. నీ చేతులతోనే నన్ను చంపెయ్‌’ అంటూ సంఘవిని శివ బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన శివ గది బయట వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న కత్తిని తీసుకొని ‘నన్ను చంపెయ్‌’ అంటూ సంఘవి పైపైకి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దదవడంతో బయట హాల్లో నుంచి పృథ్వీ గదిలోకి వెళ్లి శివతో గొడవపడ్డాడు. అప్పటికే ఆవేశంలో ఉన్న శివ, కత్తితో పృథ్వీని ఛాతీలో పొడిచాడు. భయపడిపోయిన సంఘవి, దాడి చేయొద్దంటూ శివ కాళ్ల మీద పడింది. ‘నువ్వు చెప్పినట్లే వింటా. నిన్నే పెళ్లి చేసుకుంటా. వదిలెయ్‌’ అని ప్రాధేయపడింది. అయినా ఆవేశం చల్లారని శివ, సంఘవిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పృథ్వీ పెద్దగా అరుచుకుంటూ వీధిలోకొచ్చాడు. తన అక్కను శివ చంపేస్తున్నాడంటూ పక్క పోర్షన్‌ మహిళకు చెప్పాడు. ఆపై ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెడుతూ రోడ్డుపై కుప్పకూలి మృతిచెందాడు. కాగా సంఘవి తండ్రి సురేందర్‌ గౌడ్‌ ఫిర్యాదు మేరకు నిందితుడు శివపై 302, 307, 354డి, 448 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2023-09-05T11:53:24+05:30 IST