Vasant Panchami: వసంత పంచమికి టీఎస్‌ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2023-01-24T21:48:21+05:30 IST

ఈ నెల 26న వసంత పంచమి (Vasant Panchami) సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

Vasant Panchami: వసంత పంచమికి టీఎస్‌ఆర్టీసీ 108 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్: ఈ నెల 26న వసంత పంచమి (Vasant Panchami) సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నిర్మల్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88 బస్సులు, సిద్దిపేట జిల్లాలోని వర్గల్‌కు 20 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. బుధ, గురువారాల్లో ఈ బస్సులు తిరుగుతాయని వెల్లడించింది. బాసరకు హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌ (MGBS) నుంచి 21, జేబీఎస్‌ (JBS) నుంచి 12, నిజామాబాద్‌ (Nizamabad) నుంచి 45, హన్మకొండ (Hanamkonda) నుంచి 5, కరీంనగర్‌ (Karimnagar) నుంచి 4, జగిత్యాల (Jagtial) నుంచి ఒక బస్సును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. వర్గల్‌కు సికింద్రాబాద్‌(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడిచే విధంగా ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ గురుద్వారా నుంచి 10, జేబీఎస్‌ నుంచి 6, గజ్వేల్‌ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుబోతున్నట్టు చెప్పారు.

వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్‌కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను సంస్థ పెంచుతుందని వారు స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీస్‌ లను ఉపయోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని భక్తులకు సూచించారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌ సైట్‌ www.tsrtconline.in ను సందర్శించాలని కోరారు.

Updated Date - 2023-01-24T21:48:26+05:30 IST