Share News

మలేసియాలో మ్యాన్‌హోల్‌లో పడిన కుప్పం మహిళ

ABN , Publish Date - Aug 26 , 2024 | 06:21 AM

మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మ్యాన్‌హోల్‌లోపడిన చిత్తూరు జిల్లా కుప్పం మహిళ జయలక్ష్మి ఆచూకీ మూడ్రోజులైనా లభ్యం కాలేదు.

మలేసియాలో మ్యాన్‌హోల్‌లో పడిన కుప్పం మహిళ

  • మూడు రోజులైనా లభ్యంకాని ఆచూకీ

  • ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు సీఎం చంద్రబాబు ఫోన్‌

కుప్పం, ఆగస్టు 25: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో మ్యాన్‌హోల్‌లోపడిన చిత్తూరు జిల్లా కుప్పం మహిళ జయలక్ష్మి ఆచూకీ మూడ్రోజులైనా లభ్యం కాలేదు. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని అనిమిగానిపల్లెకు చెందిన ఆరేడు కుటుంబాలు ఫ్యాన్సీ వస్తువులు తీసుకుని కౌలాలంపూర్‌ వెళ్లి వ్యాపారం చేస్తుంటారు. వారిలో జయలక్ష్మి కుటుంబం కూడా ఒకటి.

ఆమె తన భర్త, కుమారుడితో కలిసి 20 రోజుల క్రితం కౌలాలంపూర్‌ వెళ్లి ఒక దుకాణం ముందు, ఫ్యాన్సీ వస్తువుల విక్రయం మొదలు పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం (ఈ నెల 23న) ఉదయం టిఫిన్‌ చేసేందుకు వెళ్తుండగా హఠాత్తుగా రోడ్డు కుంగింది.

సరిగ్గా డ్రైనేజీ మ్యాన్‌ హోల్‌ మీద ఉన్న జయలక్ష్మి మురుగునీటి కాలువలో పడిపోయింది. అక్కడి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ సమాచారం ఇవ్వడంతో సీఎం చంద్రబాబు, బాధితురాలి కుమారుడు సూర్యకు ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు.

23వ తేదీ రాత్రి 12 గంటలదాకా గాలించిన మలేసియా అధికారులు తర్వాత చేతులెత్తేశారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు మలేసియాలోని భారత దౌత్య కార్యాలయం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు.

వాళ్లు అక్కడి అధికారులతో మాట్లాడారు. దీంతో జయలక్ష్మి కోసం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. దీనిపై జయలక్ష్మి దగ్గరి బంధువు, టీడీపీ నాయకుడు ఆర్ముగం మాట్లాడుతూ.. ఆదివారం రాత్రిదాకా ఆమె ఆచూకీ లభ్యం కాలేదన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 06:21 AM