Share News

AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jun 09 , 2024 | 05:57 PM

ఏపీలో ప్రభుత్వ మారడంతో తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని పరిశీలించారు. కాబోయే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు.

AP News: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడంటే..?

విజయవాడ: ఏపీలో ప్రభుత్వ మారడంతో తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని పరిశీలించారు. కాబోయే సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ (Nirab Kumar Prasad) నేడు(ఆదివారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే.


ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో వీవీఐపీలు, వీఐపీలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు పార్కింగ్ కు ఏర్పాట్లు చేయాలని ఎయిర్ పోర్ట్ అధికారులకు సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.


ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, తదితర వాహనాల పార్కింగ్‌కు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం.రవిచంద్ర, శశి భూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్.బాగ్చి, టీఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్నా, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్,శ్రీధర్, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ జెన్కో సీఎండీ చక్రధర్ బాబు పాల్గొన్నారు.


కాగా.. కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, టీడీపీ ప్రోగ్రాం కమిటీ సభ్యులు సత్యనారాయణరాజు పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణానికి వచ్చి ఏర్పాట్లను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పరిశీలించారు.

కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అతిథుల కోసం గ్యాలరీల నిర్మాణం చేశారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో పాటు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు. కేసరపల్లి, గన్నవరం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత చర్యలు చేపట్టారు.

Updated Date - Jun 09 , 2024 | 06:53 PM