Share News

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..

ABN , Publish Date - May 21 , 2024 | 02:51 PM

ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్‌4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

AP Politics: ఆ రెండు జిల్లాలే కీలకం.. అందరి ఆశలు ఆ సీట్లపైనే..
East and West Godavari

ఏపీ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది.. ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు. ఓటరు ఆలోచన ఎలా ఉందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఓటర్లు తమ తీర్పును రిజర్వ్ చేశారు. జూన్‌4న ఫలితం తేలనుంది. ఈలోపు ఏపార్టీ మెజార్టీ మార్క్ సాధిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్‌లో 88 స్థానాల్లో విజయం సాధిస్తే అధికారం దక్కుతుంది. ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధిస్తుందా.. వైసీపీ అధికారంలోకి వస్తుందా అనే విషయంలో ఓటింగ్ ముగిసి వారం రోజులు పూర్తైన క్లారిటీ రావడంలేదట. ఓవైపు ఇప్పటికే ప్రజాభిప్రాయం సేకరించిన సర్వే సంస్థలు మాత్రం కూటమి వైపు ప్రజలు మొగ్గుచూపారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.


ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూన్4 వరకు ఎలాంటి ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించకూడదు. దీంతో అధికారికంగా ఏ సంస్థ తమ సర్వే ఫలితాలను బహిర్గతం చేయడంలేదు. మరికొంతమంది ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కొంతమంది ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటు వేశామో బహిరంగంగా చెబుతుంటే మరికొందరు మాత్రం వెల్లడించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు ఉండగా.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోనే 34 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించగలిగితే అధికారానికి చేరువకావచ్చు. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం గతంతో పోలిస్తే వైసీపీ ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు కోల్పోవల్సి వస్తుందని.. ఎన్డీయే కూటమికి 27 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

AP Elections 2024: ఏలూరు లోక్‌సభలో గెలిచేదెవరు.. అభ్యర్థుల్లో టెన్షన్‌.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..!?


తూర్పులో 19..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో వైసీపీ గెలవగా.. 4 చోట్ల టీడీపీ, జనసేన ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేశాయి. జనసేనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ జిల్లాపై ప్రభావం చూపించేందుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేశారు. ఓటింగ్ సరళి పరిశీలించిన తర్వాత ఎన్డీయే కూటమికి కనీసం 15 నుంచి 16 సీట్లు వస్తాయని.. వైసీపీ కేవలం మూడు నుంచి నాలుగు సీట్లకే పరిమితం కావొచ్చని టీడీపీ అంచనా వేస్తోంది. అసలు ఫలితం ఎలా ఉండబోతుంది.. ఈ జిల్లా ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారనేది జూన్4న తేలనుంది.


పశ్చిమలో 15..

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో 13చోట్ల వైసీపీ గెలిచింది. కేవలం 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 13 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని.. పరిస్థితులు అనుకూలిస్తే 14 సీట్లలోనూ గెలిచే ఛాన్స్ ఉందని కూటమి నేతలు ఆశిస్తున్నారు. వైసీపీ మాత్రం తమకే మెజార్టీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తోంది.


వైసీపీ ధీమా అదే..

ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 34 సీట్లకు గానూ 2019 ఎన్నికల్లో వైసీపీ 27 స్థానాల్లో గెలిచింది. ఈసారి అదేస్థాయిలో గెలుస్తామని జగన్ ఆశలు పెట్టుకున్నారు. కానీ పోలింగ్ సరళి చూసిన తర్వాత మాత్రం వైసీపీ నేతల్లో టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తోంది. తాము అధికారానికి దూరం కావాల్సి వస్తే ఈ రెండు జిల్లాలో వచ్చే ఫలితమే కారణం కావొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. ఎన్డీయే కూటమి మాత్రం అధికారంపై కాన్ఫిడెంట్‌గా ఉంది. ఏపీని వచ్చే ఐదేళ్లు పాలించేదెవరో జూన్4న తేలిపోనుంది.


AP Elections 2024: ఎవరికి ఎన్ని సీట్లో?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 02:51 PM