Share News

Diarrhea cases: జగ్గయ్యపేటలో కొనసాగుతున్న డయేరియా మరణ మృదంగం..

ABN , Publish Date - Jun 22 , 2024 | 10:11 PM

జగ్గయ్యపేట(Jaggayyapeta)లో డయేరియా(Diarrhea) మరణాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా తాజాగా మరో నలుగురు అతిసారతో మృతిచెందారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది.

Diarrhea cases: జగ్గయ్యపేటలో కొనసాగుతున్న డయేరియా మరణ మృదంగం..

ఎన్టీఆర్: జగ్గయ్యపేట(Jaggayyapeta)లో డయేరియా(Diarrhea) మరణాలు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు మృతిచెందగా తాజాగా మరో నలుగురు అతిసారతో మృతిచెందారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య ఆరుకు చేరుకుంది. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన వాచ్‌మన్‌ సట్టు శివన్నారాయణ, చిల్లకల్లుకు చెందిన తోటపల్లి వెంకటేశ్వర్లు వాంతులు, విరేచనాలతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం మరణించారు. ప్రస్తుతం మరో నలుగురు మృతిచెందటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఎన్‌టిఆర్‌, కాకినాడ, కర్నూలు జిల్లాల్లో డయేరియా కేసులు పెరుగుతుండడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.


అతిసార కేసులు పెరుగుతుండడంతో డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్, జేసీలు జగ్గయ్యపేటలోనే మకాం వేశారు. పట్టణంలో మెుత్తం 40మంది డయేరియా బాధితుల్లో ఇంకా 22మంది చికిత్సపొందుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ పద్మావతి వెల్లడించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆమె వైద్యులను అడిగి తెలుకుంటున్నారు. వైద్యులు గంటగంటకు వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలోడయేరియా వ్యాధిగ్రస్తులను పరీక్షించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గత రెండ్రోజుల నుంచి డీఎంహెచ్‌వో సుహాసి సైతం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెడికల్‌ క్యాంపు నిర్వహిస్తూ అతిసార కేసులకు ఆమె ప్రత్యేకంగా చికిత్స చేస్తున్నారు.


వరసగా మరణాలు సంభవిస్తుండడంతో జగ్గయ్యపేటకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సీహెచ్ఎస్సీ ఇన్‌ఛార్జ్‌గా తిరువూరు ఆర్డీవో మాధవిని ప్రభుత్వం నియమించింది. పట్టణంలో వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి వాటర్ ట్యాంకుల క్లీనింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నీరు కలుషితం అయ్యే పైప్ లైన్లు గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. షేర్‌ మహమ్మద్‌ పేట, జగ్గయ్యపేట పట్టణంలో వైద్యసిబ్బంది శనివారం ప్రత్యేకంగా డయేరియా మెడికల్‌ క్యాంపులు నిర్వహించారు. షేర్‌ మహమ్మద్‌ పేట సబ్‌ సెంటర్‌‌తోపాటు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలోనూ క్యాంపులు ఏర్పాటు చేశారు. వర్షాకాల నేపథ్యంలో అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - Jun 22 , 2024 | 10:11 PM