Share News

Rajamahendravaram : వయసు 30.. కేసులు 34

ABN , Publish Date - Aug 20 , 2024 | 03:56 AM

ఆమె వయసు 30.. చోరీ కేసులు 34.. ఇప్పటికే 10 సార్లు జైలుకెళ్లి వచ్చింది.. అయినా మార్పు రాలేదు.. చోరీలు కొనసాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులే టార్గెట్‌...! వారిని మచ్చిక చేసుకుని దగ్గరవుతుంది.

Rajamahendravaram : వయసు 30.. కేసులు 34

  • ఒంటరి వృద్ధులే టార్గెట్‌.. అనపర్తిలో అరెస్టు

  • తొలుత పనిమనిషిగా దగ్గరై.. అదనుచూసి మొత్తం దోచేసే కి‘లేడీ’

  • ఇప్పటికే 16 కేసులు.. 10 సార్లు జైలుకు

  • బయటికొచ్చాక కూడా 18 దొంగతనాలు

రాజమహేంద్రవరం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆమె వయసు 30.. చోరీ కేసులు 34.. ఇప్పటికే 10 సార్లు జైలుకెళ్లి వచ్చింది.. అయినా మార్పు రాలేదు.. చోరీలు కొనసాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులే టార్గెట్‌...! వారిని మచ్చిక చేసుకుని దగ్గరవుతుంది. ఆ తర్వాత ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పోలీసులు ఆ కిలాడి లేడీ ఆట కట్టించారు.

సౌత్‌ జోన్‌ డీఎస్పీ భవ్య కిశోర్‌ సోమవారం ఆ వివరాలను వెల్లడించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన సూర్యచంద్ర చక్ర జగదాంబ (30)కు భర్త చనిపోయాడు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని పెట్రోల్‌ బంకు దగ్గర చెరువుగట్టు సమీపంలో నివాసం ఉంటోంది. వృద్ధులు ఉండే ఇల్లు కంటబడితే ఆనుపానులు గమనిస్తుంది. ఒంటరిగా ఉండే వృద్ధులైతే.. తనకు ఎవరూ లేరని, తిండికి కూడా డబ్బుల్లేవని నమ్మించి వారి ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది.


బంగారు వస్తువులు ఉన్నాయని నిర్ధారించుకున్నాక వారికి మరింత దగ్గరవుతుంది. ఆ తర్వాత మాయ మాటలు చెప్పి అన్నం, ప్రసాదం, జ్యూస్‌, కూల్‌డ్రింక్‌ ఇలా ఆ సమయానికి ఏది కుదిరితే దానిలో నిద్రమాత్రలు కలిపి ఇస్తుంది. అవి తీసుకున్న వృద్ధులు స్పృహ కోల్పోయాక ఒంటిపై ఉన్న నగలతోపాటు ఇంట్లోని బంగారు వస్తువులు దోచుకుని ఉడాయిస్తుంది.

ఈ క్రమంలో అనపర్తి పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసులో ఈ నెల 18న ఆమెను అరెస్టు చేశామని డీఎస్పీ వివరించారు. గతంలో ఆమె 16 కేసుల్లో నిందితురాలని, 10 కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించిందని చెప్పారు.

విడుదలైన తర్వాత కూడా 18 దొంగతనాలు చేసిందన్నారు. అనపర్తి, బిక్కవోలు, రాజానగరం, నిడదవోలు, కొవ్వూరు, ఉండ్రాజవరం, కాకినాడ జిల్లా కాకినాడ, పెదపూడి, గండేపల్లి, కరప, తణుకు, తాడేపల్లిగూడెం పోలీస్‌ స్టేషన్లలో జగదాంబపై కేసులు నమోదయ్యాయని చెప్పారు.

నిందితురాలి నుంచి 6 కేసుల్లో 273.8 గ్రాముల బంగారు వస్తువులు రికవరీ చేశామని, ఇంకా సుమారు 12 కేసుల్లో దోచుకున్న బంగారు వస్తువులను ఆమె వివిధ ఫైనాన్సు సంస్థలు, బ్యాంకుల వద్ద తనఖా పెట్టిందని.. వాటిని రికవరీ చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

Updated Date - Aug 20 , 2024 | 03:56 AM