Share News

AP Tourism: పర్యాటకులకు శుభవార్త.. ఆ జలపాతాల సందర్శనకు అనుమతి..

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:58 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటికి, చాపరాయి జలపాతాల సందర్శనకు రాష్ట్ర పర్యాటన శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో కటికి, చాపరాయి జలపాతాలకు భారీగా వరదనీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు.

AP Tourism: పర్యాటకులకు శుభవార్త.. ఆ జలపాతాల సందర్శనకు అనుమతి..

అరకులోయ: ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ పర్యటక కేంద్రాలైన కటికి, చాపరాయి జలపాతాల సందర్శనకు రాష్ట్ర పర్యాటన శాఖ అనుమతి ఇచ్చింది. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో కటికి, చాపరాయి జలపాతాలకు భారీగా వరదనీరు పోటెత్తింది. అప్రమత్తమైన అధికారులు పర్యాటకుల సందర్శనను నిలిపివేశారు. వర్షాలు, వరదనీరు తగ్గి జలపాతాలు సాధారణ స్థితికి రావడంతో సందర్శనను పునఃప్రారంభించారు.


చాపరాయి జలపాతం ప్రత్యేకత..

చాపరాయి జలపాతాన్ని డుంబ్రిగుడా జలపాతాలు అని కూడా పిలుస్తారు. ఇది అరకు పర్యాటక ప్రదేశానికి సుమారు 15కి.మీ. దూరంలో ఉంటుంది. అడవుల మధ్య ఉండడంతో ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఎక్కువగా మక్కువ చూపుతారు. సాధారణంగా వర్షాకాలంలో కొండప్రాంతాల్లో కురిసే వర్షాలతో జలపాతానికి భారీగా నీరు చేరుతోంది. దీన్ని చూసేందుకు, జలకాలు ఆడేందుకు పర్యాటకులు ప్రతి ఏటా పెద్దఎత్తున వస్తుంటారు. విశాలమైన కొండలపై నుంచి ఏటవాలుగా నీళ్లు పడడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రాంతం పిక్నిక్‌లకు బాగా ప్రసిద్ధి గాంచింది. వర్షాకాలంలోపాటు వేసవిలోనూ ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు.


కటికి జలపాతం ప్రత్యేకత..

కటికి గ్రామం పేరు మీదుగా ఈ జలపాతానికి పేరు వచ్చింది. బొర్రా గుహల నుంచి ఇవి సుమారు ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే అరకులోయ నుంచి 39 కి.మీ. దూరంలో ఉంటాయి. గోస్తని నది వల్ల కటికి జలపాతం ఏర్పడింది. 100అడుగుల కంటే ఎక్కువ ఎత్తు నుంచి నీరు పడడం ఇక్కడ ప్రత్యేకత. ఈ జలపాతం చుట్టూ సుందరమైన వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌ చేయడానికి అనువుగా ఉండడంతో ట్రెక్కర్లు పెద్దఎత్తున వస్తుంటారు. వెదురుబొంగు చికెన్‌కు ఇక్కడ ప్రత్యేకస్థానం ఉంది. జలపాతాన్ని సందర్శించేందుకు ఆగస్టు -డిసెంబర్ మధ్య కాలం అనువుగా ఉంటుంది.

Updated Date - Jul 30 , 2024 | 11:58 AM