Share News

Bangalore: చార్జ్‌షీట్‌లో.. ఏ2గా స్టార్‌ హీరో దర్శన్

ABN , Publish Date - Sep 05 , 2024 | 01:44 PM

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్యకేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ తూగుదీపపై చార్జ్‌షీట్‌ దాఖలయింది. రెండున్నర నెలలపాటు సాగిన కేసు మలుపులకు చార్జ్‌షీట్‌తో ఒక కొలిక్కి వచ్చింది.

Bangalore: చార్జ్‌షీట్‌లో.. ఏ2గా స్టార్‌ హీరో దర్శన్

- ఏ1గా నటి పవిత్రగౌడ

-17 మందిపై 3,991 పేజీలతో కోర్టుకు సమర్పణ

- సమగ్రంగా దర్యాప్తు : నగర పోలీస్‌ కమిషనర్‌

బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్యకేసులో కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ తూగుదీపపై చార్జ్‌షీట్‌ దాఖలయింది. రెండున్నర నెలలపాటు సాగిన కేసు మలుపులకు చార్జ్‌షీట్‌తో ఒక కొలిక్కి వచ్చింది. బుధవారం 3,991 పేజీలతో 17మంది నిందితులపై బెంగళూరులోని 24వ ఏసీఎంఎం కోర్టు ముందు ప్రిలిమినరీ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. హత్యతోపాటు కీలకమైన కేసులలో 90 రోజులలోగా చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలనే నిబంధనకు అనుగుణంగా పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. నటుడు దర్శన్‌(Actor Darshan) సహనటి పవిత్రగౌడతో సన్నిహితంగా ఉన్నారు. వీరిద్దరి సంబంధంపై దర్శన్‌ కుటుంబంలోనూ అటు ఆయన అభిమానులలోనూ అసంతృప్తి కొనసాగింది. చిత్రదుర్గకు చెందిన మెడికల్‌ షాప్‌లో పనిచేసే రేణుకాస్వామి అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పవిత్రగౌడకు అశ్లీల చిత్రాలు పంపాడు. వరుసగా ఫొటోలు, వీడియోలు పంపడంతోపాటు ‘దర్శన్‌తో ఎందుకు, నాతో సంబంధం పెట్టుకో’ అంటూ కూడా మెసేజ్‌లు చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి.

ఇదికూడా చదవండి: Minister: ఇలాంటి నటులు దేశాన్ని కాపాడగలరా?


pandu1.2.jpg

ఇదే విషయాన్ని పవిత్రగౌడ దర్శన్‌కు వివరించారు. ఆగ్రహానికి లోనైన దర్శన్‌ అతడు ఎవరో తెలుసుకోవాలని ఆప్తులకు సూచించారు. రేణుకాస్వామి చిత్రదుర్గకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇలా చిత్రదుర్గలోని దర్శన్‌ అభిమాన సంఘం అధ్యక్షుడి ద్వారా రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసి బెంగళూరు(Bangalore)కు తీసుకొచ్చారు. కామాక్షిపాళ్యలోని ఓ కారు షెడ్‌కు తీసుకొచ్చి దర్శన్‌, పవిత్ర(Darshan, Pavitra)తోపాటు పలువురు చితకబాదారు. కాసేపటికి దర్శన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆయన అనుచరులు నిరంతరంగా కొట్టడంతో రేణుకాస్వామి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న దర్శన్‌ మరోసారి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని దూరంగా తరలించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరికి సూచించారు.


సమగ్రంగా దర్యాప్తు: నగర పోలీస్‌ కమిషనర్‌

కామాక్షిపాళ్యలోని పట్టణగెరె షెడ్‌లో రేణుకాస్వామి హత్య కేసులో సమగ్ర దర్యాప్తు సాగిందని, 3,991 పేజీలతో చార్జ్‌షీట్‌ సమర్పించామని నగర పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఆర్‌టీఓలు, తహసీల్దార్‌తోపాటు 56మంది పోలీసులతో కలిపి 231 మంది నుంచి వివరాలు సేకరించామని వెల్లడించారు. 17 మంది అరెస్టుతోపాటు బెంగళూరు ఫోరెన్సిక్‌, హైదబాద్‌ సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ నివేదికలు, ఎలక్ట్రికల్‌ వస్తువులను ఉపయోగించామన్నారు. నిందితులు తప్పించుకునే ప్రయత్నమే లేకుండా చార్జ్‌షీట్‌ నమోదు చేశామన్నారు. ఏసీపీ చందన్‌కుమార్‌ నేతృత్వంలో దర్యాప్తు సాగిందన్నారు. ఇదే విషయమై రేణుకాస్వామి తండ్రి కాశీనాథ శివనగౌడ స్పందిస్తూ చార్జ్‌షీట్‌ కాపీ తీసుకున్నాక కేసు ఎలా నమోదు చేశారనేది పరిశీలిస్తామన్నారు.


తప్పించే ప్రయత్నంలో ఇరుక్కున్నారు..

కామాక్షిపాళ్యలో అనుమానాస్పద మృతదేహం లభించడంతో పోలీసులు విచారణకు సిద్ధం కాకముందే గిరినగర్‌కు చెందిన ముగ్గురు లొంగిపోయారు. తమకు అప్పు ఇవ్వాల్సి ఉండడంతో కొట్టడంతో చనిపోయాడని చెప్పారు. చిత్రదుర్గవాసికి మీరెందుకు అప్పు ఇచ్చారని పోలీసులు ప్రశ్నించి మొబైళ్లు స్వాధీనం చేసుకోవడంతో దర్శన్‌ విషయం వెలుగు చూసింది. జూన్‌ 9న కేసు నమోదు చేసుకున్న పోలీసులు 11న మైసూరులో సినిమా షూటింగ్‌లో ఉన్న దర్శన్‌ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి పోలీసులు భిన్నమైన కోణాల్లో దర్యాప్తు చేపట్టగా ఒక్కో అంశం వెలుగులోకి వచ్చాయి.

pandu1.3.jpg


17 మంది అరెస్ట్‌

రేణుకాస్వామి హత్య కేసులో ఒక్కొక్కరుగా పట్టుబడుతూ వచ్చారు. అనతి కాలంలోనే మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రతి ఒక్కరూ తప్పించుకునే యత్నంలో తప్పిదాలు చేస్తూ పట్టుబడినవారే. ఏ1గా నటి పవిత్రగౌడ, ఏ2గా దర్శన్‌ పేర్లు నమోదయ్యాయి. వీటిలో మార్పులు ఉంటాయనే చర్చ జరిగినా చార్జ్‌షీట్‌లో యథావిధిగా నమోదు చేశారు. మొత్తం 231 మంది సాక్షులను విచారించారు. ఫోరెన్సిక్‌ రిపోర్టులు 8 సేకరించగా ప్రత్యక్ష సాక్షుల ముగ్గురి వాంగ్మూలాలు కూడా ఉన్నాయి.


దర్శన్‌ విలాసంతో బళ్లారి జైలుకు ..

హత్యకేసులో దర్శన్‌ అరెస్టు అయినప్పటి నుంచి ఏదో ఒక ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. పరప్పన అగ్రహార జైలులో ఎక్కువ మంది ములాఖత్‌ వివాదం కొనసాగింది. ఇటీవలే జైలులో విలాసవంతంగా నలుగురితో కలసి కూర్చుని కాఫీ, సిగరెట్‌ సేవిస్తున్న ఫొటోలు వైరల్‌ అయ్యాయి. ఈ వివాదం జైళ్ల శాఖకే కాకుండా ఏకంగా ప్రభుత్వానికే తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో బెంగళూరు పరప్పన జైలులో ఉండే ఈ నిందితుల బృందాన్ని రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు జైళ్లకు పంపారు. అందులో భాగంగానే దర్శన్‌ను బళ్లారికి తరలించారు. ఆయన బళ్లారికి చేరుకుని వారం కాకముందే చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Sep 05 , 2024 | 01:44 PM