Share News

CBI : యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కాలేదు

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:03 AM

‘యూజీసీ-నెట్‌’ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి! ఆ ప్రశ్నపత్రం అసలు లీక్‌ కాలేదని..

CBI : యూజీసీ-నెట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కాలేదు

  • స్క్రీషాట్ పై తేదీ మార్చి టెలిగ్రామ్‌లో వైరల్‌ చేశారు

  • సీబీఐ దర్యాప్తులో వెల్లడి స్క్రీషాట్ పై

  • త్వరలోనే చార్జిషీట్‌

  • లీకేజీకి ఆధారంగా చూపిస్తున్న స్రీన్‌షాట్‌పై తేదీ మార్చి.. టెలిగ్రామ్‌ చానల్‌లో వైరల్‌ చేశారు

  • నీట్‌ పేపర్‌ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాకీ అరెస్టు!

  • పట్నాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ

న్యూఢిల్లీ, జూలై 11: ‘యూజీసీ-నెట్‌’ ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తులో సంచలన అంశాలు వెల్లడయ్యాయి! ఆ ప్రశ్నపత్రం అసలు లీక్‌ కాలేదని.. టెలిగ్రామ్‌ చానళ్లలో వైరల్‌ అయిన ప్రశ్నపత్రం స్ర్కీన్‌షాట్‌పై తేదీని ఓ యాప్‌ సాయంతో మార్చారని సీబీఐ దర్యాప్తులో తేలింది. దీని వెనుక ఒక పాఠశాల విద్యార్థి ఉన్నాడని.. ఒక యాప్‌ సాయంతో ఆ విద్యార్థి తయారుచేసిన స్ర్కీన్‌ షాట్లను ఒక వ్యక్తి సర్క్యులేట్‌ చేశాడని వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి అనధికారికంగా తీసుకెళ్లిన సీబీఐ.. ఆ వ్యక్తిపై చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు, చీటింగ్‌ కేసు పెట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

వర్సిటీలు, కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల నియామకాలకు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషి్‌పకు అర్హత సాధించడానికి ఏటా నిర్వహించే యూజీసీ-నెట్‌ను కేంద్రం ఈ ఏడాది జూన్‌ 18న నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 317 నగరాల్లో 1205 పరీక్షా కేంద్రాల్లో 11 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఆరోజు ఈ పరీక్షను రెండు సెషన్లలో (ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 దాకా ఒక సెషన్‌. మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల దాకా రెండో సెషన్‌) నిర్వహించారు.


అయితే.. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూజీసీ ప్రశ్నపత్రం స్ర్కీన్‌షాట్‌ పేరిట ఒక ఫొటో ఓ టెలిగ్రామ్‌ చానల్‌లో ప్రత్యక్షమైంది. జూన్‌ 17 తేదీతో ఉన్న ఆ స్ర్కీన్‌షాట్‌ వైరల్‌ కావడంతో యూజీసీ-నెట్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్టు జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ.. ఆ స్ర్కీన్‌షాట్‌ ఓ పాఠశాల విద్యార్థి తయారుచేసిందని, దీని వెనుక పెద్ద స్థాయి కుట్ర ఏదీ లేదని గుర్తించింది.

నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన రాకేశ్‌ రంజన్‌ అలియాస్‌ రాకీ అనే వ్యక్తిని సీబీఐ పట్నాలో అరెస్ట్‌ చేసింది. బిహార్‌లోని నలందకు చెందిన రాకీ.. పేపర్‌ లీకేజీ దందా సూత్రధారి అయిన సంజీవ్‌ముఖియాకి బంధువు. నీట్‌ పేపర్‌ లీక్‌ అయిన విషయం బయటపడినప్పటి నుంచీ రాకీ పరారీలో ఉన్నాడు. గురువారం ఉద యం సీబీఐ అధికారులు అతణ్ని పట్నా శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అతణ్ని పట్నాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. గురువారం అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పట్నాలోని మూడు చోట్ల, కోల్‌కతాలో ఒకచోట సోదాలు నిర్వహించారు. ఇప్పటిదాకా సీబీఐ ఈ కేసులో బిహార్‌, ఝార్ఖండ్‌కు రాష్ట్రాలకు చెందిన 8 మందిని అరెస్ట్‌ చేసింది.


రాకీ అరెస్టుతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా, నీట్‌ అక్రమాలపై ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, ముమ్మరంగా దర్యాప్తుచేస్తున్న సీబీఐ పట్నాలో రెండుచోట్ల, కోల్‌కతాలోని మరో రెండు చోట్ల సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తం ఈ పేపర్‌ లీక్‌కు కేంద్రం హజారీబాఘ్‌ (ఝార్ఖండ్‌)లోని ఒయాసిస్‌ స్కూలేనని అంచనాకు వచ్చినట్టు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ లీకయిన పేపర్‌ బిహార్‌కు చేరిందని సీబీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మే 5వ తేదీన నిర్వహించిన నీట్‌ పరీక్షకు సంబంధించి మొత్తం 9 సెట్ల పేపర్లు స్థానిక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖకు మే 3న చేరాయని..

అక్కడి నుంచి రెండు సెట్ల పేపర్లను నీట్‌ పరీక్షా కేంద్రమైన ఒయాసిస్‌ స్కూల్‌కు పంపించారని.. కానీ, అప్పటికే ఆ రెండు సెట్ల పేపర్ల సీళ్లు తొలగించి ఉన్నాయని సీబీఐ వర్గాల సమాచారం. మరోవైపు.. నీట్‌ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరపాల్సిన సుపీరంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా కొంత మంది పిటిషనర్లకు అందనందున విచారణను జూలై 18కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.


సీబీఐ నుంచి దర్యాప్తునకు సంబంధించి నివేదిక తమకు అందిందని వెల్లడించింది. కాగా.. నీట్‌-యూజీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూలై మూడోవారం నుంచి మొదలై నాలుగు రౌండ్లలో జరుగుతుందని కేంద్రం తాజగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇక.. నీట్‌ వ్యవహారంపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో ఈ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను గురువారం ఆయన నివాసంలో కలిశారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో ఆలస్యం జరిగితే.. దాని ప్రభావం అకడమిక్‌ క్యాలెండర్‌పై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 12 , 2024 | 05:03 AM