Share News

Delhi : ప్రధాని మోదీపై.. పుతిన్‌ గుర్రు

ABN , Publish Date - Sep 16 , 2024 | 02:21 AM

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నానాటికీ తీవ్రమవుతుండగా.. ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ వెళ్లి.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో ముఖాముఖి చర్చలు జరపడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అసంతృప్తిగా ఉన్నారా..?

Delhi : ప్రధాని మోదీపై.. పుతిన్‌ గుర్రు

  • జెలెన్‌స్కీతో భేటీపై రష్యా అధ్యక్షుడి అసంతృప్తి?

  • ప్రధాని ఆదేశంతో హుటాహుటిన రష్యాకు దోభాల్‌

  • ఉక్రెయిన్‌ అధినేతతో సమావేశంపై వివరణ!

  • పుతిన్‌తో చర్చల వీడియోను విడుదల చేసిన స్పుత్నిక్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నానాటికీ తీవ్రమవుతుండగా.. ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ వెళ్లి.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో ముఖాముఖి చర్చలు జరపడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అసంతృప్తిగా ఉన్నారా..? ఇది తెలిసే ఆయనకు వివరణ ఇచ్చేందుకు మోదీ హుటాహుటిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ను మాస్కోకు పంపారా..? తాజా పరిణామాలు దీనినే సూచిస్తున్నాయి. ఈ నెల 12న దోభాల్‌ రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ వెళ్లారు.

అక్కడ పుతిన్‌తో అంతర్గతంగా చర్చలు జరిపారు. ఆయన అధ్యక్షుడితో మాట్లాడిన వీడియోను అక్కడి వార్తాసంస్థ స్పుత్నిక్‌ విడుదల చేసింది. ఇది సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘తన ఉక్రెయిన్‌ పర్యటన, జెలెన్‌స్కీతో చర్చల సారాంశాన్ని మీకు వివరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఫోన్‌చర్చల్లో ప్రధాని (మోదీ) మీకు ఇప్పటికే తెలియజేశారు. ఆ చర్చల గురించి మీకు ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా తెలియజేసేందుకు నన్ను ఇక్కడకు పంపారు. జెలెన్‌స్కీతో చర్చలు ఆంతరంగికంగా జరిగాయి. వారిద్దరే మాట్లాడుకున్నారు.

జెలెన్‌స్కీ వెంట ఇద్దరు ఉన్నారు. ప్రధాని మోదీతో నేనున్నాను. చర్చలకు నేను ప్రత్యక్ష సాక్షిని’ అని దోభాల్‌ పుతిన్‌కు తెలిపారు. ఆయన ఒక్కో మాట పట్టి పట్టి మాట్లాడడం చూస్తే.. మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో ఏం మాట్లాడారో పుతిన్‌కు వివరణ ఇచ్చినట్లుగా ఉందని, వారిద్దరి సమావేశంపై రష్యా అధ్యక్షుడు అసంతృప్తిగా ఉన్నట్లు అర్థమవుతోందని నెటిజెన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రష్యాలోని కజన్‌లో ఈ నెల 22-24 నడుమ ‘బ్రిక్స్‌’ దేశాల సదస్సు జరుగనుంది. ఆ సందర్భంగా 22న మోదీతో ద్వైపాక్షిక భేటీకి పుతిన్‌ దోభాల్‌కు ప్రతిపాదించారు.


వాస్తవానికి పుతిన్‌తో వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలున్న మోదీ.. ఉక్రెయిన్‌పై యుద్ధం విరమించేలా ఆయనపై ఒత్తిడి తేవాలని అమెరికా, ఐరోపా దేశాలు బహిరంగంగానే కోరుతున్నాయి. ఈ యుద్ధంలో తామెవరి వైపూ నిలబడలేదనడం సరికాదని.. శాంతి వైపు తాము ఉన్నామని మోదీ పదే పదే చెబుతున్నారు. జూలై 8, 9 తేదీల్లో రష్యాను సందర్శించి పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం జరుగుతుండగా ఆయన మాస్కోకు వెళ్లి పుతిన్‌ను కలవడంపై జెలెన్‌స్కీతో పాటు అమెరికా, ఐరోపా దేశాలు ఆక్షేపించాయి.

ఇది జరిగిన ఆరు వారాల తర్వాత ప్రధాని ఆకస్మికంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళ్లి జెలెన్‌స్కీతో ప్రత్యేక చర్చలు జరిపారు. యుద్ధానికి స్వస్తి పలికేందుకు ఇరుదేశాల అధినేతలు కూర్చుని చర్చించుకోవాలని సూచించారు. శాంతి పునరుద్ధరణకు క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. పరిష్కారం కోసం వ్యక్తిగతంగా కృషిచేసేందుకూ సిద్ధమని తెలిపారు. కాగా.. గత వారం పుతిన్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమని.. అయితే సంక్షోభ పరిష్కారంలో భారత్‌, బ్రెజిల్‌, చైనా మధ్యవర్తిత్వం నెరపాలన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 02:21 AM