Share News

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

ABN , Publish Date - Aug 10 , 2024 | 05:04 AM

భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి భాషకు తనదైన గుర్తింపు ఉందని, దక్షిణాది భాషలను ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని ప్రముఖ సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.

Literature writers : దక్షిణాది భాషలు ఏకతాటిపైకి రావాలి

  • బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో వక్తలు.. పాల్గొన్న 450 మంది రచయితలు

బెంగళూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): భిన్నత్వంలో ఏకత్వంలా ప్రతి భాషకు తనదైన గుర్తింపు ఉందని, దక్షిణాది భాషలను ఏకతాటిపైకి రావాల్సిన అవసరం వచ్చిందని ప్రముఖ సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. బుక్‌ బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌ (బీబీఎల్‌ఎ్‌ఫ)-2024ను ఏర్పాటు చేయడం హర్షణీయమని కొనియాడారు. బెంగళూరు కోరమంగళలోని సెయింట్‌జాన్స్‌ ఆడిటోరియంలో మూడు రోజుల ఉత్సవానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథులుగా సాహితీవేత్తలు సచ్చిదానందన్‌, హెచ్‌ఎ్‌స శివప్రకాశ్‌, ఓల్గా, వివేక్‌ శాన్‌భోగ్‌, జయమోహన్‌ పాల్గొన్నారు.

బుక్‌ బ్రహ్మ ఉత్సవ్‌ డైరెక్టర్‌ సతీశ్‌ చప్పరికె స్వాగతోపన్యాసం చేస్తూ.. 450 మంది రచయితలు, 250కి పైగా సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్స్‌, ఐదు రాష్ట్రాల నుంచి వందకుపైగా పబ్లికేషన్స్‌, 120 మంది కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. విభిన్న భాషలకు చెందిన పుస్తకాల కోసం 60కు పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

దక్షిణాదిన కన్నడ, తమిళ, మళయాళ, తెలుగు భాషలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని సచ్చిదానందన్‌ అన్నారు. ఈ భాషల సాహిత్యం జనానికి మరింత దగ్గర చేసేలా ఒకే వేదిక ఏర్పాటు కావడం సంతోషకరమని అన్నారు. కన్నడలో వచన సాహిత్యం నేటికీ కొనసాగుతోందని తెలిపారు. కేరళలో కథాకళి, తెలుగులో బుర్రకథ.. ఇలా భిన్నమైనవి మన సంస్కృతిని చాటుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో తుళు, బ్యారి, గిరిజన భాషలు కూడా ఇలాంటి వేదికల్లో పాలుపంచుకునే అవకాశం ఉందని తెలిపారు.


హెచ్‌ఎ్‌స శివప్రకాశ్‌ మాట్లాడుతూ సుమారు 8వ శతాబ్దంలో కన్నడ కవితలకుగుర్తింపు వచ్చిందని అన్నారు. కన్నడలో ఆదికవిగా పేరొందిన పంప రచనలను ప్రస్తావించారు. తమిళంలో రాసిన తిరుప్పావై పాశురాలు భక్తికి మోక్షానికి మార్గంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం డిజిటల్‌ యుగంలో సోషల్‌ మీడియా ద్వారా ఎవరైనా తమ భావాలను వ్యక్తం చేసే అవకాశం లభిస్తోందని అన్నారు. వందేళ్ల క్రితం మద్రాస్‌ కేంద్రంగా ప్రచురణలు సాగేవని ఓల్గా అన్నారు.

అందుకే తెలుగు, తమిళ సాహితీవేత్తలు, రచయితలు అక్కడే ఎక్కువగా ఉండేవారని అన్నారు. అప్పట్లో బ్రహ్మసమాజం కొంతమేర సాహిత్యాన్ని ప్రోత్సహించేందని అన్నారు. బెంగాలీ నుంచి తెలుగు అనువాదం ఉండేదని అన్నారు. 1960 దశకంలో రష్యన్‌, అమెరికన్‌, బ్రిటీష్‌ భాషల నుంచి తెలుగులోకి అనువాదాలు జరిగాయని చెప్పారు.


చలం, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి వంటి వారు సమకాలీనులు కావడంతో అప్పట్లో సాహిత్యాన్ని తమ అభిరుచి మేరకు నాటకాలు, సంగీతం ద్వారా కూడా చాటారని అన్నారు. ప్రస్తుతం కాస్మోపాలిటన్‌ నగరాలలో నాలుగు ప్రధాన భాషలైన తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ సాహిత్యం ఎలా ఉందనేది ఈ వేదిక ద్వారా చర్చించనున్నట్టు తెలిపారు.

మాతృభాష ఏదైనా, పలు కారణాలతో పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన కారణంగా అక్కడి భాషపై మక్కువతో సాహిత్యంలో రాణించినవారు ఎందరో ఉన్నారని జయమోహన్‌ అన్నారు. అందులో తానొకడినని.. మళయాళం మాతృభాష అయినా తమిళంలో రాణించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణాలు, నగరాల వారిలో సాహితీ అభిలాష తక్కువేనని వివేక్‌శాన్‌భోగ్‌ అన్నారు. డిజిటలీకరణతో భావాలు వ్యక్తం చేసే అవకాశం చాలా తగ్గిందని అభిప్రాయపడ్డారు. మరో వేదికపై ప్రముఖ కవి హంపా నాగరాజయ్య నేతృత్వంలో పాలి-కన్నడ శబ్దకోశ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Updated Date - Aug 10 , 2024 | 05:04 AM