Share News

Youtube : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!

ABN , Publish Date - Aug 05 , 2024 | 04:28 AM

‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది.

Youtube : యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు!

  • ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనాలు

  • కేంద్రం అతి గోప్యత.. కొద్దిమందితోనే చర్చలు

  • వారికే కాపీలు.. వేర్వేరుగా వాటర్‌మార్క్‌లు

  • నిఘాలోకి యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు

  • విమర్శకులకు ఇక మీదట గడ్డు పరిస్థితులు

  • నిబంధనలు కఠినం.. భారీ జరిమానా, నిషేధం

  • బిల్లు చట్టం అయితే భావప్రకటన స్వేచ్ఛ ఖతం

  • సోషల్‌ మీడియాపైనా ఉక్కుపాదమే: విపక్షాలు

  • అండగా నిలవాలని యూట్యూబర్ల వేడుకోలు

లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమకు వ్యతిరేకంగా పని చేశారని మోదీ ప్రభుత్వం భావిస్తోందా? తాము ఆశించిన ఫలితాలు రాకపోవటానికి, ప్రతిపక్షం అంతోఇంతో బలం సమకూర్చుకోవటానికి వీరు విస్తృతంగా జరిపిన ప్రచారమే కారణమని అనుకుంటోందా? ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాను, యూట్యూబర్లను, స్వతంత్ర జర్నలిస్టులను కూడా ప్రభుత్వ నియంత్రణ కిందికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందా? ‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ విషయంలో గోప్యత, బిల్లులో ఉన్నాయని భావిస్తున్న కఠినమైన ఆంక్షలు ఈ సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దీంతో బిల్లుపై ప్రతిపక్షాల నుంచి యూట్యూబర్ల వరకూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

(సెంట్రల్‌ డెస్క్‌)

‘ప్రసార సేవల నియంత్రణ బిల్లు’ తొలి ముసాయిదా గత ఏడాది విడుదలైంది. ప్రధానంగా ఓటీటీ వేదికలు, ప్రసార సంస్థలను ఉద్దేశించి రూపొందించిన ఈ బిల్లుపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తమైంది. లోక్‌సభ ఎన్నికలు రావటంతో ఈ అంశం తాత్కాలికంగా తెరమరుగైంది. ఎన్నికలు ముగిసి మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తాజాగా మరోసారి బిల్లు చర్చనీయాంశమైంది.


ఈ బిల్లులో పలు సవరణలు చేసి, ఎంపిక చేసిన కొందరికి ఇటీవల అందజేశారని, వారితోనే దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడైంది. అంతేకాదు, బిల్లు కాపీని ఇచ్చిన ప్రతీ వ్యక్తికీ ఆ బిల్లుపై ఓ ప్రత్యేకమైన వాటర్‌మార్క్‌ ముద్రించారని, ఒకవేళ ఎవరైనా బిల్లును ‘లీక్‌’ చేస్తే ఎవరి ద్వారా అది జరిగిందో తెలుసుకోవటానికి

ఈ పని చేశారని తెలుస్తోంది. దేశ ప్రజానీకాన్ని ప్రభావితం చేసే చట్టాల రూపకల్పన విషయంలో ఇంతటి గోప్యత ఏమిటంటూ ప్రముఖ ఇంగ్లిష్‌ దినపత్రిక ‘ది హిందూ’ తన సంపాదకీయం ద్వారా కేంద్రాన్ని ఇటీవల ప్రశ్నించింది. సవరించిన బిల్లులో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే పలు ఆంశాలున్నాయంటూ విపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా.. స్వతంత్ర భారతదేశంలో మనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై ఈ బిల్లు ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. దీనివల్ల కంటెంట్‌ క్రియేటర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, స్వతంత్ర మీడియా సంస్థలపై ప్రభుత్వ నిఘా పెరుగుతుందన్నారు. బిల్లులో సవరణలు చేసి ఆ ప్రతులను రహస్యంగా కొందరు వ్యక్తులకు, కొన్ని వ్యాపారసంస్థలకు ఇచ్చారని, పార్లమెంటుకు మాత్రం ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని టీఎంసీ ఎంపీ జవహర్‌ సర్కార్‌ అన్నారు.


సవరించిన బిల్లులో ఏముంది?

  • సవరించిన బిల్లు ఇప్పటి వరకూ బహిర్గతం కాలేదు. వాస్తవానికి, ఒక బిల్లు చట్ట రూపం దాల్చాలంటే దాని ముసాయిదాను బహిరంగంగా వెల్లడించి, దానిపై ప్రజానీకం నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలు ఆహ్వానించి.. వాటిపై సమీక్ష జరిపి అప్పుడుగానీ బిల్లుకు తుదిరూపం ఇవ్వరు. కానీ, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు విషయంలో ఈ ప్రక్రియ జరగటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • ఇంతకూ ఈ వివాదాస్పద బిల్లులో ఉన్న అంశాలేమిటి అన్నదానిపై సంబంధిత వర్గాలు చెబుతున్న దాని ప్రకారం..

  • - ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో ప్రజాదరణ ఉన్న వారిని ఇకపై డిజిటల్‌ వార్తా ప్రసారకులుగా గుర్తిస్తారు. బిల్లు చట్టరూపం దాల్చిన నెలరోజుల్లో ఈ డిజిటల్‌ వార్తా ప్రసారకులు ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి.

  • ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ వేదికలకు అమలవుతున్న మూడంచెల నియంత్రణ వ్యవస్థ కిందికి ఇక మీదట డిజిటల్‌ వార్తా ప్రసారకులు కూడా వస్తారు.


  • ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం ఈ డిజిటల్‌ వార్తా ప్రసారకుల కార్యాలయాలను తనిఖీ చేయవచ్చు. ఆ సందర్భంగా అవసరమైతే అక్కడున్న పరికరాలు, ఉపకరణాలు వేటినైనా స్వాధీనం చేసుకోవచ్చు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతోపాటు నిషేధం విధించవచ్చు.

  • ఉదాహరణకు, సబ్‌స్రైబర్ల డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయకపోతే తొలిసారి రూ.50 లక్షలు, ఆ తర్వాత నుంచి రూ.2.5 కోట్ల జరిమానా విధిస్తారు.

  • కాగా, సదరు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల గురించి ప్రభుత్వం ఏదైనా సమాచారం అడిగినప్పుడు ఆ వివరాలను మెటా, యూట్యూబ్‌, ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా కంపెనీలు అందించాలి.

  • అంతేకాదు, ఆన్‌లైన్‌ యాడ్‌ నెట్‌వర్క్‌లైన గూగుల్‌ యాడ్‌సెన్స్‌, ఫేస్‌బుక్‌ ఆడియెన్స్‌ నెట్‌వర్క్‌ వంటివి కూడా ఈ బిల్లు కిందికి వస్తాయి. దీనివల్ల యూట్యూబర్ల ఆదాయం కూడా ప్రభావితం కానుంది.


కష్టకాలంలో ఉన్నాం.. అండగా ఉండండి!

మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో ప్రధాన మీడియాను ముఖ్యంగా జాతీయ మీడియాను తన అదుపాజ్ఞల్లో పెట్టుకుందని, దీంతో ప్రజలకు వాస్తవాలు తెలియజేసే బాధ్యతను యూట్యూబ్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల ద్వారా తాము నిర్వర్తించామని ఆయా రంగాల్లో పని చేస్తున్న వారు చెబుతున్నారు. అందుకే సర్కారు తమపై కక్షగట్టి, ఈ కొత్త బిల్లు తీసుకొస్తుందని ఆరోపిస్తున్నారు. తమ కృషి వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు గౌరవనీయమైన స్థాయిలో సీట్లు లభించాయని పేర్కొంటూ, ఇప్పుడు కష్టకాలంలో ఉన్న తమకు అండగా ఉండాలని కోరుతున్నారు. పార్లమెంటులో దీని గురించి ప్రస్తావించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిజంగానే సోషల్‌మీడియాలో ఉన్న అపసవ్య ధోరణులను ఎదుర్కొనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే, తాము స్వాగతిస్తామని, సహకరిస్తామని పలువురు యూట్యూబర్లు పేర్కొంటున్నారు. బిల్లును బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సంతకాల సేకరణ జరుపుతున్నారు.


ప్రభావం ఎలా ఉంటుంది?

యూట్యూబర్లు, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, చిన్నపాటి బృందాలతో ఆన్‌లైన్‌ వార్తాసంస్థలను నడుపుతున్న వాళ్లు ఈ నిబంధనలతో తమ పనిని కొనసాగించలేని పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారు, ప్రజలకు వాస్తవాలను తెలియజేసే వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో అసమ్మతి కీలకమైన అంశమని, దానిని వినిపిస్తున్న ధ్రువ్‌రాథీ వంటి యూట్యూబర్లు, రవీశ్‌కుమార్‌ వంటి స్వతంత్ర జర్నలిస్టులే లక్ష్యంగా ఈ బిల్లు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. భారీ మీడియా కంపెనీలకు, యూట్యూబర్‌ను ఒకేగాటన గట్టి నిబంధనలు రూపొందించటం ఏమిటన్న విమర్శ వినిపిస్తోంది.

Updated Date - Aug 05 , 2024 | 07:16 AM