PM Modi: అభివృద్ధికే పెద్దపీట.. భవిష్యత్ కోసం ఎన్నో సంస్కరణలు.. ప్రధాని మోదీ..

ABN , First Publish Date - 2024-02-10T17:50:49+05:30 IST

ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజు సందర్భంగా లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు.

PM Modi: అభివృద్ధికే పెద్దపీట.. భవిష్యత్ కోసం ఎన్నో సంస్కరణలు.. ప్రధాని మోదీ..

ఈ ఐదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజు సందర్భంగా లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆర్టికల్ 370ను తొలగించడం ద్వారా రాజ్యాంగం పూర్తిగా ఆవిష్కృతమైందని ప్రధాని మోదీ అన్నారు. తద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలకు సామాజిక న్యాయం అందించగలుగుతున్నామన్నారు. జీ-20కి అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు దక్కిందని, వ్యవస్థలు మారినా దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎప్పుడూ మారదని చెప్పారు. క‌రోనా స‌మ‌యంలో కూడా దేశ కార్యక్రమాలు ఆగిపోనివ్వలేదని దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించారని కొనియాడారు. ఆ సమయంలో ఎంపీలు సైతం తమ నిధులను వదులుకున్నారని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

రాముడు లేని భారత దేశాన్ని ఊహించలేం..

దేశానికి మరోసారి తీర్మానాలను జాతి పాదాల చెంత అంకితం చేసే అవకాశం వచ్చింది. ఈ ఐదేళ్లు దేశంలో జరిగిన సంస్కరణలు, పనితీరు, పరివర్తనలతో కొత్త నమ్మకం పెరుగుతోంది. బడ్జెట్ సెషన్ చివరి రోజున శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం సురక్షితంగా నిర్వహించిందని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎన్నో సంస్కరణలు చేశామన్నారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించలేమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.


తొలి బిల్లు అదే..

"ఈ ఐదేళ్లు దేశంలో రిఫామ్‌, పర్‌ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌ సంబంధించినవి. సంస్కరణలు, పనితీరు కారణంగా జరిగిన పరివర్తనను మనం చూడగలుగుతున్నాం. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేసే చట్టాన్ని 17వ లోక్‌సభ హయాంలో ఆమోదించాం. కొత్త పార్లమెంట్ లో ఆమోదించిన తొలి బిల్లు కూడా ఇదే. సభ తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఇది ఒకటి. మహిళలకు వారి హక్కులను కల్పించాలనేదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

చివరి ప్రసంగం ఇదే..

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన చివరి ప్రసంగం ఇదే. ఈ సమావేశాల అనంతరం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. మూడో దఫా ప్రభుత్వంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - 2024-02-11T16:11:59+05:30 IST