Share News

Uttar pradesh : నీట్‌ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టు

ABN , Publish Date - Jun 23 , 2024 | 04:08 AM

నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎ్‌సటీఎఫ్‌) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్‌ ముఖియాకు అత్రి సన్నిహితుడు.

Uttar pradesh : నీట్‌ లీకేజీ సూత్రధారి రవి అత్రి అరెస్టు

  • ఝార్ఖండ్‌లో మరో ఆరుగురికి బేడీలు

  • నిందితుల ఫ్లాట్‌ నుంచి పేపర్‌ సీజ్‌

  • 14కు చేరిన అరెస్టుల సంఖ్య

  • కుట్రదారు ముఖియా కోసం వేట

  • బిహార్‌లోని ప్రైవేటు కాలేజీలపై నిఘా

పట్నా, జూన్‌ 22: నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలకంగా వ్యవహరించిన రవి అత్రిని ఉత్తరప్రదేశ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎ్‌సటీఎఫ్‌) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజీవ్‌ ముఖియాకు అత్రి సన్నిహితుడు. నోయిడాకు చెందిన అత్రి తాజా కేసులో మధ్యవర్తిగా వ్యవహరించాడని, గతంలోనూ పేపర్‌ లీకేజీలో అరెస్టయ్యాడని పోలీసులు వివరించారు. 2007లో వైద్య విద్యలో ప్రవేశాలకు కోచింగ్‌ తీసుకునేందుకు అత్రి రాజస్థాన్‌లోని కోటాకు వెళ్లాడని,

2012లో పరీక్ష పాసై.. ఎంబీబీఎస్‌ సీటు సంపాదించాడని చెప్పారు. అయితే.. ఎంబీబీఎస్‌ నాలుగో సంవత్సరం పరీక్షలు రాయకుండా.. నోయిడా చేరుకుని, పేపర్‌ లీకేజీ మాఫియాతో చేతులు కలిపాడని వెల్లడించారు. ‘‘సాల్వర్‌ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసి.. విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను పంపంచేవాడు’’ అని వివరించారు. అత్రి పట్టివేతతో ఈ కేసులో బిహార్‌ పోలీసుల అరెస్టుల సంఖ్య 14కు పెరిగింది. నిందితులను విచారించగా.. సంజీవ్‌ ముఖియా పేరు ప్రముఖంగా వెలుగులోకి వచ్చిందని, ఈ లీకేజీ రాకెట్‌ వెనక ప్రధాన కుట్రదారు అతడేనని పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న బిహార్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోయూ) అధికారులు శనివారం ఝార్ఖండ్‌లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు నీట్‌ పరీక్షకు ముందు పట్నాలో అద్దెకు దిగిన ఫ్లాట్‌ నుంచి ప్రశ్నపత్రాన్ని సీజ్‌ చేశామని, ఎన్‌టీఏ అధికారులు పంపిన రిఫెరెన్స్‌ ప్రశ్నపత్రంతో దాన్ని పరిశీలిస్తున్నామని ఈవోయూ అధికారులు తెలిపారు. ‘‘ఈ కేసులో బిహార్‌లోని మరికొన్ని కాలేజీలపై నిఘా పెట్టాం.


నీట్‌ పరీక్ష జరిగిన రోజు ఏయే కాలేజీల్లో పరీక్ష కేంద్రాలున్నాయి? వాటిల్లోకి విద్యార్థుల బదులు సాల్వర్‌ గ్యాంగ్‌ వ్యక్తులు లోనికి ఎలా వెళ్లగలిగారు? ఆయా విద్యాసంస్థల్లో వారికి సహకరించిన వారెవరు? ఈ గ్యాంగ్‌ పంపిన విద్యార్థుల సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ ఒకేచోట వచ్చేలా చేయడానికి సహకరించిందెవరు? అనే కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నాం. కాలేజీల సిబ్బంది, సాల్వర్లకు భారీగా నగదు అందినట్లు గుర్తించాం. మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగనుంది’’ అని వివరించారు. నిందితుల నుంచి నిజాలను రాబట్టేందుకు నార్కో అనాలిసిస్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఎవరీ ముఖియా?

సంజీవ్‌ ముఖియా బిహార్‌లోని నలంద జిల్లా నాగర్‌సోనా ప్రాంతానికి చెందినవాడు. తొలుత సాబూర్‌ వ్యవసాయ కళాశాలలో పనిచేశాడు. అక్కడ ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణలతో 2016లో అరెస్టయ్యి, జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత నలంద కాలేజీలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేశాడు. గతంలో ప్రభుత్వ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ కేసుల్లో ఇతని పేరు బయటకు వచ్చింది. ఇతని కుమారుడు, వైద్యుడు శివకుమార్‌ బిహార్‌ టీచర్ల నియామక పరీక్ష పేపర్‌ లీకేజీలో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సంజీవ్‌ ముఖియా, శివకుమార్‌ కలిసి ‘ముఖియా సాల్వర్‌ గ్యాంగ్‌’ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో లీకైన ప్రశ్నపత్రం తొలుత ముఖియాకే అందిందని బిహార్‌ ఈవోయూ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముఖియా అరెస్టుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

నీట్‌ను ఎందుకు రద్దుచేయలేదంటే

ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు ఆధారాలున్నా.. అరెస్టులు జరుగుతున్నా.. నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేయకపోవడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం వివరణ ఇచ్చారు. లీకేజీ ఓ ప్రాంతానికి మాత్రమే.. అదికూడా కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితమైందన్నారు. ‘‘కౌన్సెలింగ్‌ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. నీట్‌ను రద్దు చేస్తే.. నిజాయితీగా పరీక్ష రాసినవారికి ఇబ్బందులు కలుగుతాయి. ఈ వ్యవహారం ఇప్పటికే సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కోర్టు నిర్ణయమే ఫైనల్‌’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Jun 23 , 2024 | 04:08 AM