Share News

Rajya Sabha polls: జయాబచ్చన్‌ను తిరిగి నామినేట్ చేసిన ఎస్‌పీ

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:05 PM

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్‌ ను సమాజ్‌వాదీ పార్టీ తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Rajya Sabha polls: జయాబచ్చన్‌ను తిరిగి నామినేట్ చేసిన ఎస్‌పీ

లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు ప్రముఖ నటి, రాజకీయవేత్త జయాబచ్చన్‌ (Jaya Bachchan)ను సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) తిరిగి నామినేట్ చేసింది. అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ మంగళవారంనాడు రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జయాబచ్చన్‌తో పాటు రామ్‌జీలాల్ సుమన్, మాజీ ఐఏఎస్ అధికారి అలోక్ రంజన్‌లను నామినేట్ చేసింది. ఈ ముగ్గురూ ఈరోజే నామినేషన్లు వేస్తున్నట్టు ఎస్‌పీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.


బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల్లో నలుగురు బీసీలు

కాగా, లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు కావడంతో బీజేపీ ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఏడుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో నలుగురు బీసీలను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. వీరిలో మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ (సైంధ్వార్ కుర్మి), మాజీ ఎంపీ చౌదరి తేజ్‌వీర్ సింగ్ (జాట్), రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అమ్రపాల్ మౌర్య (కొయెరి), మాజీ రాష్ట్ర మంత్రి సంగీత బల్వంత్ (బింద్) ఉన్నారు. పార్టీ ప్రతినిధి సుధాన్షు త్రివేది (బ్రాహ్మిణ్), మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్ (క్షత్రియ), ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్‌ (జైన్)లను పార్టీ అభ్యర్థులుగా బీజేపీ నామినేట్ చేసింది.


యూపీలో 10 స్థానాలకు ఎన్నిక

ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, ఆ తర్వాత మహారాష్ట్ర, బీహార్‌లో చెరో 6, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో చెరో 5, కర్ణాటక, గుజరాత్‌లలో నాలుగేసి చొప్పున, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థానాల్లో మూడేసి చొప్పున, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు ఫలితాలు వెలువడతాయి.

Updated Date - Feb 13 , 2024 | 03:05 PM