Share News

T20 World Cup: అలా జరిగితే.. భారత జట్టు ఇంటిదారి పట్టడమే!

ABN , Publish Date - Jun 24 , 2024 | 03:23 PM

టీ20 వరల్డ్‌కప్‌లోని సూపర్-8లో భారత జట్టు మెరుగైన స్థానంలో ఉంది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సొంతం చేసుకొని.. అద్భుత నెట్ రన్‌రేట్‌తో గ్రూప్-1లో అగ్రస్థానంలో...

T20 World Cup: అలా జరిగితే.. భారత జట్టు ఇంటిదారి పట్టడమే!
T20 World Cup

టీ20 వరల్డ్‌కప్‌లోని (T20 World Cup) సూపర్-8లో భారత జట్టు మెరుగైన స్థానంలో ఉంది. రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సొంతం చేసుకొని.. అద్భుత నెట్ రన్‌రేట్‌తో గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. భారత జట్టు సెమీ ఫైనల్స్‌లో దాదాపు తన బెర్తుని ఖరారు చేసుకున్నట్టే. కానీ.. కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం టీమిండియా ఇంటిదారి పట్టే ఛాన్స్ ఉంది.


అవేంటంటే..

* 24వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 41 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు ఆసీస్ రన్‌రేట్ మెరుగుపడి.. రెండో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకుతుంది.

* మరోవైపు.. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టీమ్ భారీ విజయాన్నే నమోదు చేయాల్సి ఉంటుంది. ఆఫ్ఘన్ మొదట బ్యాటింగ్ చేసిందంటే.. అప్పుడు బంగ్లాదేశ్‌ని కనీసం 83 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది.


ఈ రెండు సమీకరణాలు సాధ్యమైతేనే.. భారత జట్టు సెమీస్‌కి చేరుకుండానే ఇంటిదారి పట్టొచ్చు. కానీ.. ఆ రెండు టాస్క్‌లు అంత సులువైనవి కావు. అద్భుతాలు జరిగితే తప్ప.. అవి సాధ్యపడవు. కాబట్టి.. సెమీస్‌కి భారత్ చేరడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకవేళ ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధిస్తే.. సెమీస్ బెర్తు కన్ఫమ్ అవుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా, ఆఫ్ఘన్ జట్ల మధ్యే సెమీస్ బెర్తు కోసం పోరాటం కొనసాగుతుంది.


ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌లో చేరాలంటే.. తప్పకుండా భారత్‌ని ఓడించాల్సి ఉంటుంది. ఒకవేళ భారత్ చేతిలో ఆసీస్ ఓడిపోతే.. అప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘన్ ఓడిపోవాలి. అప్పుడే ఆసీస్‌కి సెమీస్‌లో చోటు దక్కుతుంది. అలా కాకుండా బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘన్ భారీ పరుగుల తేడాతో గెలిస్తే మాత్రం.. ఆసీస్ ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. చివరికి ఎలాంటి ఫలితాలు నమోదవుతాయో వేచి చూడాలి.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 24 , 2024 | 03:23 PM