Share News

India vs Zimbabwe: చివరి మ్యాచ్‌లోనూ భారత్‌దే విజయం.. 4-1 తేడాతో సిరీస్ సొంతం

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:11 PM

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా.. ఆదివారం భారత్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ జింబాబ్వే పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్‌తో..

India vs Zimbabwe: చివరి మ్యాచ్‌లోనూ భారత్‌దే విజయం.. 4-1 తేడాతో సిరీస్ సొంతం
India vs Zimbabwe

హరారే స్పోర్ట్స్ క్లబ్ (Harare Sports Club) వేదికగా.. ఆదివారం భారత్‌తో (Team India) జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లోనూ జింబాబ్వే (Zimbabwe) పరాజయం పాలయ్యింది. టీమిండియా నిర్దేశించిన మోస్తరు లక్ష్యాన్ని కూడా ఛేధించలేకపోయింది. 168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు.. భారత బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో 125 పరుగులకే పేకమేడలా కుప్పకూలింది. దీంతో.. 42 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ముఖ్యంగా.. ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టి, జింబాబ్వే బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో భారత్ 4-1 తేడాతో సిరీస్‌ని సొంతం చేసుకుంది.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (58) అర్థశతకంతో అదరగొట్టడంతో పాటు శివమ్ దూబే (22) మెరుపులు మెరిపించడంతో.. టీమిండియా అంత స్కోరు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 18.3 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్ల దెబ్బకు ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. డియోన్ మైయర్స్ (34), మారుమణి (27), అక్రమ్ (27) కాస్త ఫర్వాలేదనిపించారు. మిగితా వాళ్లంతా చేతులు ఎత్తేశారు. ఏ ఒక్కరూ కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయారు. దీంతో.. జింబాబ్వేకి ఈ ఓటమి తప్పలేదు.


ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. ముకేశ్ కుమార్ అద్భుతమైన స్పెల్ వేశాడు. జింబాబ్వే బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తాను వేసిన 3.3 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. శివమ్ దూబే సైతం తన మ్యాజిక్ ప్రదర్శించాడు. నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా వికెట్ తీసుకున్నారు. స్కోర్లు: భారత్ - 167/6, జింబాబ్వే - 125/10 (18.3)

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 08:11 PM