Share News

India vs Zimbabwe: మోస్తరు స్కోరుకే జింబాబ్వే ఖేల్ ఖతం.. భారత్ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - Jul 13 , 2024 | 06:18 PM

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో ఆడుతున్న నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. మొదట్లో బ్యాటర్లు..

India vs Zimbabwe: మోస్తరు స్కోరుకే జింబాబ్వే ఖేల్ ఖతం.. భారత్ లక్ష్యం ఎంతంటే?
India vs Zimbabwe

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. భారత్‌తో ఆడుతున్న నాలుగో మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు మోస్తరు స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసింది. మొదట్లో బ్యాటర్లు దూకుడుగానే ఆడారు కానీ, ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి చతికిలపడ్డారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో సికందర్ రజా (46) మెరుపులు మెరిపించడం వల్లే.. భారత్‌ ముందు జింబాబ్వే 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు కాబట్టి.. ఆ లక్ష్యాన్ని సునాయాసంగానే ఛేధిస్తారని అనిపిస్తోంది. ఒకవేళ భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే.. సిరీస్ కైవసం అవుతుంది. అయితే.. జింబాబ్వే బౌలర్లను అంత తక్కువ అంచనా వేయకూడదు. వాళ్లు మ్యాజిక్ చేసినా చేయొచ్చు.


తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకి ఓపెనర్లు శుభారంభమే అందించారు. క్రీజులో అడుగుపెట్టడంతోనే దూకుడుగా ఆడారు. కానీ.. ఇంతలోనే భారత బౌలర్లు పుంజుకోవడంతో వాళ్లు నెమ్మదించారు. ఇక తొలి వికెట్ పడిన తర్వాత ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. స్కోరు ముందుకే సాగలేదు. అప్పుడు క్రీజులోకి వచ్చిన సికందర్ రజా కాసేపు బౌండరీల మోత మోగించాడు. మొదట్లో అతను నిదానంగానే ఆడినా.. ఆ తర్వాత తన బ్యాట్‌కి పని చెప్పి, కొన్ని భారీ షాట్లు బాదాడు. అతను క్రీజులో ఉన్నంతవరకూ జింబాబ్వే స్కోరు కాస్త పరుగులు పెట్టింది. కానీ.. అతను ఔటయ్యాక మళ్లీ నత్తనడకలా సాగింది. చివరకు.. జింబాబ్వే 152 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరి.. 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేధిస్తుందా? లేదా? అనేది చూడాలి.


ఇక భారత బౌలర్ల విషయానికొస్తే.. ఖలీల్ అహ్మద్ మంచి స్పెల్ వేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులిచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ సైతం బంతిని బాగానే తిప్పేశాడు. వికెట్లు తీయకపోయినా.. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇక తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే తలా వికెట్ పడగొట్టారు. తుషార్ ఒక్కడే కాస్త ఎక్కువ పరుగులిచ్చాడు. 3 ఓవర్లలో 10 ఎకానమీతో 30 పరుగులు సమర్పించుకున్నాడు.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 06:20 PM