Share News

CM Revanth Reddy: మేడిగడ్డ పనుల పరిశీలనకు సీఎం..

ABN , Publish Date - May 24 , 2024 | 03:58 AM

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారని, ఈ మేరకు సీఎం నాలుగైదు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.

CM Revanth Reddy: మేడిగడ్డ పనుల పరిశీలనకు సీఎం..

  • నాలుగైదు రోజుల్లో పర్యటన

  • బ్యారేజీ రక్షణకు చర్యలు తీసుకోండి

  • వానాకాలంలోపు పనులు పూర్తి చేయాలి

  • నిర్మాణ సంస్థ అధికారులకు మంత్రి ఉత్తమ్‌ నిర్దేశం, సమీక్ష

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న మరమ్మతు పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించనున్నారని, ఈ మేరకు సీఎం నాలుగైదు రోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల వద్ద జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ భేటీలో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ డైరెక్టర్‌ (ఇరిగేషన్‌) దేశాయ్‌, ఆ సంస్థకు చెందిన ఇతర ప్రతినిధులు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదిక ప్రకారమే మరమ్మతులు జరపాలని, ఈ పనులన్నీ వానాకాలంలోపు పూర్తిచేసి బ్యారేజీని కాపాడుకోవాలని ఉత్తమ్‌కుమార్‌ స్పష్టం చేశారు.


కుంగిన ఏడో బ్లాకులోని గేట్లను ఎత్తే ప్రక్రియ చేపడుతున్నామని, బ్యారేజీకి గ్రౌటింగ్‌ పూర్తిచేసి, ఏడో బ్లాకుకు దిగువ భాగంలో షీట్‌ఫైల్స్‌ వేస్తామని ఈ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు తెలిపారు. దెబ్బతిన్న పిల్లర్లకు చెందిన గేట్లను కూడా ఎత్తుతామని, షీట్‌ ఫైల్స్‌ను ఇప్పటికే దిగుమతి చేసుకున్నామన్నారు. రాత్రనక, పగలనక మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేస్తున్నామని, వానాకాలంలో వరద సాఫీగా వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని నివేదించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జరుగుతున్న మరమ్మతులను అధికారులు మంత్రికి వివరించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీద తదుపరి అధ్యయనంపై ప్రతిపాదనలను తమ ఉన్నతాధికారులకు నివేదిస్తామని పుణెకు చెందిన కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)కు చెందిన భూభౌతిక, భూసాంకేతిక, నాన్‌ డిస్ట్రక్టివ్‌ విభాగాలకు చెందిన ముగ్గురు నిపుణులు నీటిపారుదల శాఖ అధికారులకు తెలిపారు. ఈఎన్‌సీ (జనరల్‌) జీ అనిల్‌కుమార్‌, ఈఎన్‌సీ (ఓ అండ్‌ ఎం) బీ నాగేంద్రరావుతో వారు భేటీ అయ్యారు. 2 రోజుల తమ పర్యటనలో పరిశీలించిన అంశాలపై డైరెక్టర్‌కు ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు.

Updated Date - May 24 , 2024 | 03:58 AM