Share News

Hyderabad: రుణమాఫీకి వడివడిగా అడుగులు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:34 AM

‘‘ఆరు నూరైనా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేసి తీరుతా..!’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శపథం చేసిన మేరకు.. అధికారులు ఆ దిశలో విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేశారు. నేడోరేపో మార్గదర్శకాలను వివరించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.

Hyderabad: రుణమాఫీకి వడివడిగా అడుగులు..

  • నేడో, రేపో ఉత్తర్వుల జారీకి చాన్స్‌

  • ఉద్యాన పంటలకూ మాఫీ వర్తింపు!!

  • లబ్ధిదారుల గుర్తింపు బాధ్యత గ్రామస్థాయి అధికారులకే

  • 18 నెలల స్వల్పకాలికానికే రుణ మాఫీ

  • దీర్ఘకాలిక రుణాలకు అవకాశం లేనట్లే!

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆరు నూరైనా.. పంద్రాగస్టులోగా రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేసి తీరుతా..!’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శపథం చేసిన మేరకు.. అధికారులు ఆ దిశలో విధివిధానాలపై కసరత్తు ముమ్మరం చేశారు. నేడోరేపో మార్గదర్శకాలను వివరించే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రాథమిక అంచనా మేరకు రూ.2లక్షల్లోపు రుణమాఫీ చేయడానికి రూ.31 వేల కోట్ల మేర నిధులు అవసరం. ప్రభుత్వం ఓవైపు నిధుల వేటను కొనసాగిస్తూనే.. రైతుభరోసాకు కేటాయించిన బడ్జెట్‌ను రూ.7,500 కోట్లను రుణమాఫీకి మళ్లించే దిశలో చర్యలు తీసుకుంటోంది. రైతుభరోసా విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఓ స్పష్టత రానుంది. ఆలోగా.. ఈ నిధులతో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించాలని సర్కారు కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.


పాత మార్గదర్శకాలతోనే..

రుణమాఫీలో లబ్ధిదారుల ఎంపికకు దాదాపుగా పాత మార్గదర్శకాలనే అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గత ప్రభుత్వం రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసినప్పుడు అవలంబించిన నిబంధనలనే.. అధికారులు లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికంగా తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే రూ.2 లక్షల్లోపు రుణమాఫీకి కటాఫ్‌ తేదీని ప్రభుత్వం ప్రకటించింది. అంటే.. 2018 డిసెంబరు 12 నుంచి 2023 డిసెంబరు 9వరకు రుణాలు తీసుకున్నవారేమాఫీకి అర్హులు. అదీ 18 నెలల కాలవ్యవధితో స్వల్పకాలిక పంటరుణాలై ఉండాలి. దీర్ఘకాలిక పంటరుణాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని, రుణమాఫీ చేస్తారు.


కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. పంచాయతీ అసిస్టెంట్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారులు(ఏఈవో), పంచాయతీ కార్యదర్శులు అర్హుల కుటుంబాలను గుర్తిస్తారు. ఈ ప్రక్రియను తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తారు. రైతులకు ఎన్ని బ్యాంకుల్లో అప్పులున్నా.. గరిష్ఠంగా ఒక కుటుంబానికి 2లక్షల వరకే మాఫీ వర్తిస్తుంది. అసలు, వడ్డీ, రెన్యువల్‌ రుణాలు కలిపి కుటుంబానికి .2లక్షల్లోపే మాఫీ ఉంటుంది. ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలకూ ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


మూడు ఫార్మాట్లలో వివరాలు

మూడు ఫార్మాట్లలో లబ్ధిదారుల వివరాలను సేకరిస్తారు. అనెక్సర్‌-ఏ, బీల్లో రైతుల వివరాలు ఉంటాయి. ఈ వివరాలను క్రోడీకరించి.. అనెక్సర్‌-సీలో పొందుపరుస్తారు. ఈ ఫార్మట్లతో బ్యాంకు మేనేజర్లు తమ వద్ద ఉన్న వివరాలను పోల్చిచూసుకుంటారు. ఈ మూడు ఫార్మాట్లలోని వివరాలు లీడ్‌ బ్యాంకు మేనేజర్ల ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు చేరుతాయి. డూప్లికేషన్‌, డబుల్‌ పేమెంట్‌ వంటి సమస్యలను అధిగమించేందుకు మండల స్థాయిలో సంయుక్త బ్యాంకర్ల కమిటీలు పనిచేస్తాయి. ఈ కమిటీలు అన్ని బ్యాంకుల్లో రుణాల వివరాలను క్రోడీకరిస్తాయి. నకిలీ పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలతో తీసుకున్న రుణాలను గుర్తిస్తాయి. చివరి దశలో.. జిల్లా సహకార ఆడిటర్లు, డీసీసీబీలు, బ్యాంకులు పంపే వివరాలను వ్యవసాయ శాఖ ఐటీ విభాగం స్ర్కూటినీ చేసి, పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తుంది. లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీలు, బ్యాంకుల వద్ద ప్రదర్శిస్తారు. ఆ జాబితాలపై ఎవరైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తే.. పరిగణనలోకి తీసుకుని, పరిశీలిస్తారు.

Updated Date - Jul 02 , 2024 | 04:34 AM