Share News

ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ నేతలు..

ABN , Publish Date - Jul 02 , 2024 | 06:24 PM

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ (Telangana cabinet expansion) నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ పీసీసీ(TPCC) ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు(Prem Sagar Rao), శ్రీహరి ముద్ధిరాజు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్.. ఢిల్లీకి వెళ్లి తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ నేతలు..

ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(Telangana cabinet expansion) నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ పీసీసీ(TPCC) ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు(Prem Sagar Rao), శ్రీహరి ముద్ధిరాజు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్.. ఢిల్లీకి వెళ్లి తమ అదృష్ఠాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరి.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీని మర్యాదపూర్వకంగా కలిశారు.


ఇప్పటికే గత ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్‌, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై కాంగ్రెస్‌ అగ్రనేతలతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే 11మంది మంత్రులుగా ఉన్నారు. మరో ఏడెనిమిది మందికి చోటు కల్పించేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇటీవల 5రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నేతలు, పార్టీ పెద్దలతో విస్తృతంగా చర్చించారు. పలు సామాజిక సమీకరణాల ఆధారంగా పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి రెండు, వెలమల ఒకటి, బీసీలకు ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.


ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలకు మంత్రి, నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్‌, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్‌రావు సహా పలువురి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలుస్తున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 06:38 PM