Share News

Duddilla Sridhar Babu : అమిత్‌ షా, నరేంద్ర మోదీల ప్రశంసల కోసమే..రాజీవ్‌ విగ్రహం తొలగిస్తామంటున్నారు

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:27 AM

సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

Duddilla Sridhar Babu : అమిత్‌ షా, నరేంద్ర మోదీల ప్రశంసల కోసమే..రాజీవ్‌ విగ్రహం తొలగిస్తామంటున్నారు

  • బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోంది

  • 8 వేల గ్రామాలకు టీఫైబర్‌ నెట్‌వర్క్‌

  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. అమిత్‌షా, నరేంద్ర మోదీల ప్రశంసలు పొందడానికే రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటున్నారని విమర్శించారు. ఆయన కరీంనగర్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. భూ ప్రపంచం ఉన్నంత కాలం రాజీవ్‌గాంధీ విగ్రహం అక్కడే ఉంటుందన్నారు. సాంకేతిక విప్లవాన్ని దేశానికి తీసుకువచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ అని అన్నారు. రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు తెలంగాణ సాకారం చేసిన వ్యక్తి సోనియాగాంధీ అని తెలిపారు. రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేస్తే దానికి అర్థం తెలియని వ్యక్తులు ఆయన విగ్రహం ఏర్పాటుపై విమర్శలు చేస్తున్నారన్నారు.

పరిపాలన కేంద్రమైన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ కీలకమైందన్నారు. ఆరు గ్యారెంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయవద్దా?, మహిళలకు ఉచిత ప్రయా ణం వద్దా..? అని ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వనరుల గురించి ప్రధాని మోదీకి తెలుసునని అన్నారు. హైడ్రా అనేది చెరువులు, వనరులు కాపాడేందుకేనని, అక్రమంగా ఎవరు ఏ పని చేసినా ఊరుకునేది లేదన్నారు.

తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రధాన మంత్రిగా కాకుండా బీజేపీ నేతగా మాట్లాడి ఉండవచ్చన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దీనిపై శాసనసభాపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


ప్రతి గ్రామానికి ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కేంద్రం సహకారంతో అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఇప్పటికే 8 వేల గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ పనులు పూర్తయ్యాయని, ఇంకా 3 వేల గ్రామాలకు పూర్తిచేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగిపేట, నారాయణఖేడ్‌ జిల్లా మద్దునూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌ గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో రూ.528 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందన్నారు. కేబుల్‌ నెట్‌వర్క్‌, కంప్యూటర్‌ నదుపాయం, టెలిఫోన్‌ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. 20 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ డాటా సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మాజీ ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు.

Updated Date - Sep 18 , 2024 | 04:28 AM