Share News

Hyderabad: రూ.800కోట్ల కుంభకోణం ముమ్మాటికీ నిజం

ABN , Publish Date - May 28 , 2024 | 03:12 AM

పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండరు ప్రక్రియలో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘టెండరు నిబంధనల ప్రకారం.. మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35లక్షల టన్నుల ధాన్యాన్ని కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు తరలించాలి.

Hyderabad: రూ.800కోట్ల కుంభకోణం ముమ్మాటికీ నిజం

  • ధాన్యం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమా?

  • డీఫాల్ట్‌ మిల్లర్ల జాబితా ఎందుకు బయటపెట్టరు?

  • ఏప్రిల్‌లో సెటిల్‌మెంట్‌ మీటింగ్‌ వాస్తవం కాదా?

  • టీపీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా?

  • ఉత్తమ్‌ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి ధ్వజం

  • ఏప్రిల్‌లో సెటిల్‌మెంట్‌ మీటింగ్‌.. వాస్తవం కాదా?

  • టీపీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా?

  • ఉత్తమ్‌ వ్యాఖ్యలపై ఏలేటి ధ్వజం

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండరు ప్రక్రియలో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘టెండరు నిబంధనల ప్రకారం.. మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35లక్షల టన్నుల ధాన్యాన్ని కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు తరలించాలి. ఇందుకోసం క్వింటాల్‌కు రూ.2,007 చొప్పున ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ, తమకు ధాన్యం బదులు క్వింటాల్‌కు రూ.2,223 చొప్పున నగదు ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లు మిల్లర్లను డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న అధికారులు.. వంద రూపాయల స్టాంప్‌ పేపర్లపై మిల్లర్లతో అగ్రిమెంట్లు రాయిస్తున్నారు.


అంటే, కాంట్రాక్టర్లు ధాన్యాన్ని తరలించకుండానే క్వింటాల్‌కు అదనంగా రూ.216 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది మొత్తంగా రూ.800 కోట్ల కుంభకోణం.. ఇది జరగట్లేదని చెప్పండి.. నేను బహిరంగ చర్చకు సిద్ధం’’ అని మంత్రి ఉత్తమ్‌కు సవాల్‌ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన సదరు స్టాంపు పేపరు కాపీని మీడియాకు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీఎం రేవంత్‌కు తాను 19 ప్రశ్నలు సంధిస్తే, బహుశా ఆయన ఒత్తిడితో మంత్రి ఉత్తమ్‌ ఒక్క ప్రశ్నకైనా స్పందించారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన మిల్లర్ల నుంచి వసూళ్లకు పాల్పడడం ఎంతవరకు సబబు? ఇందుకు సంబంధించి గత ఏప్రిల్‌ 18న జలసౌధలో మిల్లర్లతో సెటిల్‌మెంట్‌ మీటింగ్‌ నిర్వహించడం వాస్తవం కాదా? అని ఉత్తమ్‌ను నిలదీశారు.


‘‘ఆనాడు మీరు టీపీసీసీ పదవి ఎలా తెచ్చుకున్నారో... పదేళ్లు మీతో సహవాసం చేసిన నాకు తెలియదా? మీలాగా మాట్లాడాలంటే ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ, నాది అలాంటి దిగజారుడు వ్యక్తిత్వం నాది కాదు. మీలాగా అపాయింటెడ్‌ నేతను కాదు. సబ్జెక్టుకు సంబంధించిన అంశాన్ని తాను ప్రస్తావిస్తే వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు? తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ ఇక్కడ లేరని గుర్తుంచుకోండి. గతంలో ఆర్‌ టాక్స్‌, ఆర్‌ఆర్‌ టాక్సు, బీ టాక్స్‌ గురించి నేను మాట్లాడితే స్పందించని మీరు, ఇప్పుడు ఇంత సీరియ్‌సగా స్పందిస్తున్నారంటే భారీ కుంభకోణమే జరిగినట్లు తేటతెల్లమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. సూర్యాపేటలో రూ.90కోట్లు బకాయి ఉన్న మిల్లర్‌ను అరెస్టు చేసిన అధికారులు.. వందల కోట్లు బకాయి ఉన్న మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. డీఫాల్ట్‌ మిల్లర్ల జాబితాను ఎందుకు బయటపెట్టడం లేదని ఉత్తమ్‌ను నిలదీశారు. ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన ధాన్యాన్ని.. టెండర్ల ద్వారా విక్రయించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.

Updated Date - May 28 , 2024 | 03:12 AM