Share News

Governor Radha Krishnan: మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారం..

ABN , Publish Date - Jun 11 , 2024 | 03:28 AM

మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్‌ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు.

Governor Radha Krishnan:  మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారం..

  • వ్యవసాయానికి నాణ్యమైన విత్తనాలు కీలకం

  • రైతులకు జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ

  • మెరుగైన విత్తనాలను ఇవ్వడం హర్షణీయం: గవర్నర్‌ రాధాకృష్ణన్‌

రాజేంద్రనగర్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్‌ రాధాకృష్ణన్‌ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్‌ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ 6వ స్నాతకోత్సవం సోమవారం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ దశలోకి ప్రవేశిస్తున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసం, అంకితభావంతో ముందుకు వెళ్లాలని, జీవితంలో ఒడిదొడుకులు సహజమని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.


స్నాతకోత్సవానికి ఎస్బీఐ కో-ఎండీ చల్లా శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన తాను ఈ వ్యవసాయ కళాశాలలోనే చదివానని చెప్పారు. కాగా, ఈ స్నాతకోత్సవంలో యూజీ, పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసిన 517 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకున్నారు. 235 మంది విద్యార్థులు తర్వాత డిగ్రీలను తీసుకుంటామని తెలిపినట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.


ఇద్దరు విద్యార్థినులకు 6 గోల్డ్‌ మెడల్స్‌

సోమవారం డిగ్రీ పట్టాలను పొందిన వారిలో సూర్యాపేటలోని తిరుమలగిరికి చెందిన బజ్జూరి దివ్య, కరీంనగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వెలిచాల సాయిప్రత్యూష ఇద్దరూ ఆరు చొప్పున బంగారు పతకాలను సాధించారు. దివ్య ప్రస్తుతం ఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌లో జెనిటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. గొప్ప శాస్త్రవేత్త కావాలన్నదే తన ధ్యేయమని దివ్య ఆంధ్రజ్యోతికి చెప్పారు. ప్రత్యూష ప్రస్తుతం గుంటూరులోని కాంటినెంటల్‌ కాఫీ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో వ్యవసాయశాఖ లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో శాస్త్రవేత్తగా పనిచేయాలని కోరికగా ఉందని ప్రత్యూష తెలిపారు.

Updated Date - Jun 11 , 2024 | 03:28 AM