Share News

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌ 7 రోజులు..

ABN , Publish Date - Jun 13 , 2024 | 03:52 AM

గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.

Hyderabad: గ్రూప్‌-1 మెయిన్స్‌ 7 రోజులు..

  • అక్టోబరు 21 నుంచి 27 దాకా పరీక్షల నిర్వహణ

  • మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ!

  • అక్టోబరు 21వ తేదీన జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష

  • అన్ని పరీక్షలూ ఒకే మాధ్యమంలో రాయాలి

  • అభ్యర్థులకు కమిషన్‌ అధికారుల సూచనలు

  • త్వరలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. అయితే... అభ్యర్థులు అన్ని పరీక్షలనూ ఏదో ఒక మీడియంలోనే రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఏ మీడియంలో రాసేదీ తెలపాల్సి ఉంటుంది. ఒక పరీక్ష తెలుగులో, మరో పేపర్‌ను ఇంగ్లి్‌షలో రాయడానికి వీల్లేదు. అలా వేర్వేరు మాధ్యమాల్లో రాసినవారి పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. రాష్ట్రంలో సుమారు 563 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అందులో ఉత్తీర్ణులైనవారిని.. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచే అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నియామకాల్లో ఏలాంటి ఇంటర్య్వూలూ ఉండవు. మెయిన్‌ పరీక్షలకు సంబంధించిన వివరాలను కమిషన్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పరీక్షల తొలిరోజు అయిన అక్టోబరు 21న క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ (జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష) నిర్వహించనున్నారు. అనంతరం ఇతర పేపర్ల పరీక్షలను నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ కాకుండా మెయిన్స్‌లో మొత్తం 6 పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తున్నారు.


  • పరీక్షలన్నీ హైదరాబాద్‌, దాని చుట్టు పక్కల హెచ్‌ఎండీఏ పరిధిలోనే జరుగుతాయి. ప్రతిపేపర్‌లోనూ 150 మార్కులకు ప్రశ్నలుంటాయి.

  • అభ్యర్థులు అన్ని పేపర్లూ రాయాల్సి ఉంటుంది. ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా ఆ అభ్యర్థులు రాసిన ఇతర పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.

  • క్వాలిఫయింగ్‌ పరీక్షను 10వ తరగతి ప్రమాణాలతో నిర్వహిస్తారు. ఇతర పేపర్ల పరీక్షలకు సంబంధించిన సిలబ్‌సను ఇప్పటికే ప్రకటించారు.

గ్రూప్‌-1 ప్రిలిమినరీ కీ విడుదల

ఈ నెల 9వ తేదీన నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష కీని విడుదల చేశారు. గురువారం (13వ తేదీ) నుంచి 17వ తేదీ మధ్య ఈ కీ కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. కీపై అభ్యంతరాలుంటే.. 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలపాల్సిందిగా అభ్యర్థులకు అధికారులు సూచించారు.

Updated Date - Jun 13 , 2024 | 03:52 AM