Share News

Hyderabad: రూ.600 కోట్ల మోసాలు..

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:41 AM

గుజరాత్‌ అడ్డాగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కట్టించారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు.. 36 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు.

Hyderabad: రూ.600 కోట్ల మోసాలు..

  • దేశవ్యాప్తంగా 983 సైబర్‌ నేరాలు.. తెలంగాణలోనే 131 కేసులు

  • 20 కేసుల్లో రూ.12.50 కోట్లకు టోకరా.. 38.28 లక్షలు స్వాధీనం

  • ఖాతాల్లో రూ.2.89 కోట్లు ఫ్రీజ్‌.. ఇప్పటికే రూ.1.51 కోట్ల రిఫండ్‌

  • దర్యాప్తులో 7 బృందాల పోలీసులు.. ఏకకాలంలో దాడులు

  • 36 మంది సైబర్‌ కేటుగాళ్ల అరెస్టు.. నిందితులంతా గుజరాత్‌ వారే

  • హైదరాబాద్‌పై సైబర్‌ పంజా విలువ ఏటా రూ.1,000 కోట్లు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ అడ్డాగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్ల ఆటను హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కట్టించారు. ఏడు బృందాలుగా విడిపోయిన పోలీసులు.. 36 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరంతా దేశవ్యాప్తంగా 983 సైబర్‌ నేరాలకు పాల్పడి.. రూ.600 కోట్లు కొల్లగొట్టారని పోలీసులు అంచనా వేస్తున్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌ డీసీపీ శ్వేతతో కలిసి.. నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి వివరాలను వెల్లడించారు.


ట్రేడింగ్‌లో 500ు లాభాల పేరుతో రాంకోఠికి చెందిన ఓ వ్యాపారి వద్ద సైబర్‌ నేరగాళ్లు రూ.2 కోట్లు కొట్టేశారు. ఇదే నేరశైలితో ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని నమ్మించి, రూ.60.88 లక్షలు దోచుకున్నారు. తమను తాము ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులుగా పరిచయం చేసుకున్న కేటుగాళ్లు.. మీ పేరుతో ఉన్న పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయంటూ బెదిరించి, సికింద్రాబాద్‌కు చెందిన 74 ఏళ్ల వయసున్న ఓ డాక్టర్‌ వద్ద రూ.1.60 కోట్లను కొల్లగొట్టారు. ఇలా బాధితులు చేసిన ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ సెల్‌ పోలీసులు.. నిందితుల ఆట కట్టించేందుకు రంగంలోకి దిగారు.


సాంకేతిక ఆధారాలను పకడ్బందీగా సేకరించి, అన్ని ముఠాలు గుజరాత్‌కు చెందినవని గుర్తించారు. డీసీపీ కవిత, ఏసీపీల నేతృత్వంలో ఏడు బృందాలుగా విడిపోయిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. 12 రోజుల పాటు గుజరాత్‌లో మకాం వేశారు. పకడ్బందీగా రెక్కీ నిర్వహించి, స్థానిక పోలీసుల సహకారంతో నిందితుల ఆట కట్టించారు. మూడు ప్రధాన కేసుల్లో ఏడుగురు నిందితులను సూరత్‌లో అరెస్టు చేశారు.


వీరిని సాగర్‌ గోవర్ధన్‌భాయ్‌, ప్రజాపత్‌, భావ్‌నగర్‌కు చెందిన పర్మార్‌ కిరీట్‌ నాథూభాయ్‌, రాజ్‌కోట్‌కు చెందిన చూడాసమా కుల్‌దీప్‌ సింగ్‌, కినోజియా కేతన్‌, సురేశ్‌ భాయ్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌ నికుంజ్‌ కిశోర్‌, ప్రవీణ్‌భాయ్‌ కల్లూభాయ్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.38.28 లక్షల నగదు, నాలుగు ల్యాప్‌టా్‌పలు, 64 స్మార్ట్‌ఫోన్లు, 112 సిమ్‌కార్డులను సీజ్‌ చేశారు. వీరిచ్చిన సమాచారంతో మిగతా 29 మంది సైబర్‌ కేటుగాళ్లను అరెస్టు చేసి, హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.


  • 20 కేసుల్లో.. 12.49 కోట్లు దోచేసి..

తదుపరి దర్యాప్తులో ఈ 36 మంది నిందితులను ప్రాథమికంగా విచారించిన పోలీసులు.. వీరంతా తెలంగాణలో 131, ఒక్క హైదరాబాద్‌లోనే 30 నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. నగరంలో కేవలం 20 కేసుల్లో రూ.12.49 కోట్లను కొట్టేసినట్లు నిర్ధారించారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.89 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. అందులోంచి రూ.1.51 కోట్లను బాధితులకు రీఫండ్‌ చేశారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 983 నేరాలకు పాల్పడి.. రూ.600 కోట్లను కొట్టేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని సీపీ చెప్పారు. నిందితులను పోలీసు కస్టడీకి తీసుకుని, లోతుగా విచారిస్తే.. మరిన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్లు వివరించారు. భారీ ఆపరేషన్‌ నిర్వహించి, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు, మధుసూదన్‌రావు, ఎస్సైలు అభిషేక్‌, మన్మోహన్‌, సతీశ్‌రెడ్డి, ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.


  • ఏటా రూ.1000 కోట్ల సైబర్‌ దోపిడీ

హైదరాబాద్‌పై సైబర్‌ నేరాల ప్రభావం తీవ్రంగా ఉందని నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. సైబర్‌ కేటుగాళ్లు నగరంలో ఏటా రూ.700 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు కొల్లగొడుతున్నట్లు వివరించారు. అంటే.. రోజుకు రూ.2 కోట్లకు పైనే లూటీ నడుస్తోందని పేర్కొన్నారు. అత్యాశ అనేది ఓ జబ్బుగా మారి, పౌరులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకునేలా చేస్తోందని హెచ్చరించారు. సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టే డబ్బును తిరిగి రాబట్టుకోవడం చాలా కష్టమని, కొన్ని సందర్భాల్లో అస్సలు తిరిగి రాదని చెప్పారు.

Updated Date - Aug 25 , 2024 | 04:41 AM