Share News

Hyderabad : హరిత రిసార్టులు, హోటళ్లు ప్రైవేటు పరం?

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:54 AM

తెలంగాణ పర్యాటక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న హరిత హోటళ్లు, మరికొన్ని రిసార్టులు ప్రయివేట్‌పరం కానున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్న హోటళ్లు, రిసార్టుల నిర్వహణను ప్రయవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Hyderabad : హరిత రిసార్టులు, హోటళ్లు ప్రైవేటు పరం?

  • ఇప్పటికే ప్రైవేట్‌కు అప్పగించిన కడెం రిసార్టు.. జాబితాలో తారామతి-బారాదరి.. నిజామాబాద్‌, అనంతగిరి హిల్స్‌

  • వరంగల్‌లోని రిసార్టులు కూడా..

  • బేగంపేట టూరిజం ప్లాజానూ

  • ప్రైవేటుకు అప్పగించాలని ప్రతిపాదన!

  • కోట్లాది రూపాయల ఆదాయమున్నా..

  • నిర్వహణ బాధ్యత నుంచితప్పుకోనున్న పర్యాటక సంస్థ!

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పర్యాటక సంస్థకు కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తున్న హరిత హోటళ్లు, మరికొన్ని రిసార్టులు ప్రయివేట్‌పరం కానున్నాయి. వివిధ ప్రాంతాలనుంచి వచ్చే పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ఆహ్లాదాన్ని అందిస్తున్న హోటళ్లు, రిసార్టుల నిర్వహణను ప్రయవేట్‌ సంస్థలు, వ్యక్తులకు అప్పగించేందుకు పర్యాటక సంస్థ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో హోటళ్లు, రిసార్టులలో ఆయా విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పనిచేస్తున్న సుమారు 45 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు సమాచారం. ఏటా సుమారు కోటి రూపాయలకుపైగా ఆదాయాన్ని సమకూర్చుతున్న నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు సమీపంలో ఉన్న హరిత రిసార్ట్‌, హోటల్‌ను గత నెలలోనే ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. హైదరాబాద్‌లోని గోల్కొండ సమీపంలో సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అభివృద్ధి చేసిన తారామతి-బారాదరి రిసార్టు, హోటళ్లు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


30 గదులు, రెండు ఫంక్షన్‌ హాళ్లు, బార్‌ తదితర సకల సౌకర్యాలతో ఉన్న ఈ రిసార్టు, హోటళ్ల నుంచి పర్యాటక సంస్థకు నెలకు సుమారు రూ.1.5 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. కానీ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ రిసార్టు ఆదాయాన్ని కోల్పోతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో నిర్వహణ బాధ్యత నుంచి పర్యాటక సంస్థ తప్పుకునేందుకు సిద్ధమైన్నట్లు తెలిసింది. సుమారు 50 గదులతో విస్తరించిన నిజామాబాద్‌ హరిత రిసార్టు సైతం ప్రయివేట్‌ వ్యక్తుల స్వాధీనం కానున్నట్టు సమాచారం. ఏటా సుమారు రూ.2.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుతున్న ఈ రిసార్టును హస్తగతం చేసుకునేందుకు కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.

వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌ సమీపంలో పర్యాటక సంస్థ 30 గదులతో అభివృద్ధి చేసిన హరిత రిసార్ట్‌ సైతం ప్రయివేట్‌పరం కానున్నట్టు సమాచారం. ఈ రిసార్టు ద్వారా ఏటా మూడున్నర కోట్లకు పైగా ఆదాయం వస్తున్నట్టు తెలిసింది. ఇక వరంగల్‌లో రెండు ఫంక్షన్‌ హాళ్లు, 50 గదులు, బార్‌ తదితర సౌక ర్యాలతో విస్తరించిన పర్యాటక సంస్థ రిసార్టును సైతం ప్రయివేట్‌ వ్యక్తులకు అప్పగించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. హైదరాబాద్‌ బేగంపేట టూరిజం ప్లాజాను సైతం ప్రయివేట్‌ పరం చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం.

Updated Date - Jul 22 , 2024 | 02:54 AM