Share News

Hyderabad: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..

ABN , Publish Date - Jul 05 , 2024 | 03:41 AM

రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు.

Hyderabad: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా..

  • ఆయనను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామా చేశారు. గురువారం ఆయన రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను కోరారు. సీఎం రేవంత్‌ సాయంత్రం కేకే నివాసానికి వెళ్లి, ఆయన్ను పలకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేకే రాజీనామా అంశం పార్టీ అంతా కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, రాష్ట్రానికి ఏది మంచో కేకే నిర్ణయిస్తారని తెలిపారు. ఆయన సలహా మేరకే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేకే మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌ మనిషినని, పార్టీలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నానన్నారు.


కాంగ్రెస్‌ ఎంపీల పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రజస్వామ్యబద్ధంగా పాలన సాగుతోందన్నారు. ఆర్నెల్లలోనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేశారని కితాబిచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్నవారు కుటుంబ ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తాను కాంగ్రె్‌సలో చేరినవెంటనే నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. కాగా, కేకే సేవలను రాష్ట్రంలో ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నామని, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తామని రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. ఆయన్ను తిరిగి రాజ్యసభకు పంపించే విషయమై అడగ్గా.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తన స్థాయిలో నిర్ణయం జరగదని అన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 03:42 AM