Share News

BRS: ఇల్లందులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. వీగిన అవిశ్వాసం..

ABN , Publish Date - Feb 05 , 2024 | 03:14 PM

తెలంగాణలో ఎక్కడ చూసినా అవిశ్వాస తీర్మానంపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల మున్సిపల్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది. ఏ కౌన్సిలర్ ఎటు ఓటు వేస్తాడో తెలియకుండా ఉంది.

BRS: ఇల్లందులో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ.. వీగిన అవిశ్వాసం..

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో ఎక్కడ చూసినా అవిశ్వాస తీర్మానంపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలు చోట్ల మున్సిపల్ చైర్మన్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం జరిగింది. ఏ కౌన్సిలర్ ఎటు ఓటు వేస్తాడో తెలియకుండా ఉంది. ఈ అవిశ్వాస తీర్మానాలు ఎక్కువగా కాంగ్రెస్‌కే ఫేవర్‌గా జరుగుతున్నాయి. నేడు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈ అవిశ్వాస పరీక్షలో బీఆర్ఎస్‌కు ఎదురు దెబ్బ తగిలింది.

అవిశ్వాసం నెగ్గే మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో అవిశ్వాసం వీగింది. అవిశ్వాసం వీగినట్లు ప్రిసైడింగ్ అధికారి ఆర్డీవో శిరీష ప్రకటించారు. దీంతో దమ్మాలపాటి తిరిగి చైర్మన్‌గా కొనసాగనున్నారు. కొద్ది రోజుల క్రితం మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటిపై అవిశ్వాసం కోరుతూ కొందరు కౌన్సిలర్లు వినతిపత్రం సమర్పించడంతో జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇల్లందు పురపాలకంలో చైర్మన్ సహా 24 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో కోరం ప్రకారం 17 మంది సభ్యులు హాజరవ్వాలి. ఒక్కరు తగ్గినా అవిశ్వాసం వీగుతుంది. కాగా.. అవిశ్వాస తీర్మాన సమావేశానికి 15 మంది మాత్రమే బీఆర్ఎస్ సభ్యులు ఉండటంతో అవిశ్వాసం వీగిపోయింది.

మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన..

అవిశ్వాస తీర్మానానికి ముందు.. పెద్ద రచ్చే జరిగింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తమ కౌన్సిలర్లను బలవంతంగా తీసుకెళ్లారంటూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆందోళనకు దిగారు. అవిశ్వాస తీర్మానం ఓటింగ్ ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలన్నారు. అధికార బలంతో తమ పార్టీ కౌన్సిలర్స్‌ని కిడ్నాప్ చేశారని.. అవిశ్వాస పరీక్షకు మరో తేదీని ప్రకటించాలంటూ ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్స్ 15 మంది ఉండటంతో అధికారులు ఆ పార్టీకి అరగంట సమయం ఇచ్చారు. అయినా కూడా వారు రాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయింది.

Updated Date - Feb 05 , 2024 | 03:14 PM