Share News

MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రావడం లేదు..

ABN , Publish Date - Aug 20 , 2024 | 09:13 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పాలనపై పట్టు రావడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. రూ.2లక్షల వరకూ రైతు రుణ మాఫీ చేసినట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి సగం మాత్రమే మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు.

MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రావడం లేదు..
BJP Medak MP Raghunandan Rao

మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం పాలనపై పట్టు రావడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) అన్నారు. రూ.2లక్షల వరకూ రైతు రుణ మాఫీ చేసినట్లు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారని, కానీ వాస్తవానికి సగం మాత్రమే మాఫీ చేశారని ఆయన పేర్కొన్నారు. రామాయంపేటలో బీజేపీ నిర్వహించిన కృతజ్ఞత సభకు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


కమిషన్ల పేరిట కాలయాపన..

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఒక్క కాళేశ్వరంలోనే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించినట్లు ఎంపీ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా.. కాళేశ్వరం విచారణ కమిషన్, విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇన్ని నెలలు ఉన్నా కూడా ఆయనకు పాలనపై ఇంకా పట్టురాలేదని ఎద్దేవా చేశారు.


స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి..

తెలంగాణలో పూర్తిగా రుణమాఫీ చేసినట్లు సీఎం రేవంత్ చెప్తున్నారని, కానీ వాస్తవానికి సగం మాత్రమే మాఫీ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. ఇంకా లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదని ఎంపీ చెప్పుకొచ్చారు. రూ.2లక్షల రుణమాఫీ పూర్తయ్యే వరకూ కాంగ్రెస్ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. నవంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు ఎంపీ వెల్లడించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు రఘునందన్ రావు పిలుపునిచ్చారు. అందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు.


బీఆర్ఎస్‌‌తో జత కట్టే ప్రసక్తే లేదు..

ఇటీవల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వార్తలు వస్తున్నాయని, మునిగిపోయే ఆ పార్టీతో బీజేపీ జత కట్టే అవకాశమే లేదని ఎంపీ అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలు విఆర్ఎస్ ఇచ్చారని ఎంపీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా తప్పులు చేస్తున్నారని, ఆయనకు కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 09:13 PM