Share News

Hyderabad: సెల్‌ఫోన్‌ దొంగల కోసం పోలీసు వేట..

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:07 AM

మారణాయుధాలతో ప్రజలను భయపెట్టి సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు వేటాడి అరెస్టు చేశారు. ద్విచక్రవాహనంపై పారిపోతున్న దొంగలను వెంటాడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో వారిలో ఒకరికి బుల్లెట్‌ గాయమైనా పరారయ్యారు. మారణాయుధాలతో ప్రజలను భయపెట్టి సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు వేటాడి అరెస్టు చేశారు. ద్విచక్రవాహనంపై పారిపోతున్న దొంగలను వెంటాడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో వారిలో ఒకరికి బుల్లెట్‌ గాయమైనా పరారయ్యారు.

Hyderabad: సెల్‌ఫోన్‌ దొంగల కోసం పోలీసు వేట..

  • వెంటాడి, కాల్పులు జరిపినా బుల్లెట్‌ గాయంతో పరారు

  • 2 రోజుల్లోపే ఇద్దరు దొంగల్ని అరెస్టు చేసిన పోలీసులు.. సికింద్రాబాద్‌లో ఘటన

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మారణాయుధాలతో ప్రజలను భయపెట్టి సెల్‌ఫోన్‌ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు వేటాడి అరెస్టు చేశారు. ద్విచక్రవాహనంపై పారిపోతున్న దొంగలను వెంటాడిన పోలీసులు జరిపిన కాల్పుల్లో వారిలో ఒకరికి బుల్లెట్‌ గాయమైనా పరారయ్యారు. కానీ, వేట కొనసాగించిన పోలీసులు ఆ దొంగలను 48 గంటల్లోనే కటకటాల్లోకి నెట్టారు. ఈ హైవోల్టేజీ యాక్షన్‌ ఎపిసోడ్‌ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రష్మి పెరుమాళ్‌ కథనం ప్రకారం.. ఫలక్‌నుమాకు చెందిన మసూద్‌ ఉర్‌ రహమాన్‌, బోలక్‌పూర్‌ ముషీరాబాద్‌కు చెందిన ఫజల్‌ ఉర్‌ రెహమాన్‌ బంధువులు. విలాసవంతమైన జీవితం, చెడు అలవాట్లకు బానిసలైన వీరిద్దరూ దొంగతనాలు చేస్తుంటారు.


జూన్‌ 19, బుధవారం అర్ధరాత్రి తర్వాత ఒక ద్విచక్రవాహనంపై వెళ్లిన వీరిద్దరూ మలక్‌పేట పరిధిలోని ఓ బార్‌ వద్ద ద్విచక్రవాహనాన్ని చోరీ చేసి మసూద్‌ ఇంటి దగ్గర పెట్టారు. తిరిగి రాత్రి రెండున్నర గంటల సమయంలో సికింద్రాబాద్‌ వచ్చిన ఇరువురు రైల్వేస్టేషన్‌ వైపు వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి కత్తులతో బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. అక్కడి నుంచి పారిపోయే క్రమంలో నానా బీభత్సం చేశారు. బాధితుడు సాయం కోసం కేకలు వేయడంతో అక్కడే మఫ్టీలో ఉన్న యాంటీ చైన్‌ స్నాచింగ్‌ టీమ్‌ (క్రైమ్‌ డెకాయ్‌) పోలీసులు అప్రమత్తమై దొంగలను వెంటాడారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న దొంగలు.. పోలీసులకు కత్తులు చూపించి బెదిరిస్తూ పాదచారుల సెల్‌ఫోన్లు లాక్కునేందుకు యత్నించారు.


దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకీతో బైక్‌ టైర్‌కు కాల్చారు. ఈ క్రమంలో బుల్లెట్‌ మసూద్‌ కుడి కాలికి తగిలింది. అయినా వాహనం ఆపకపోవడంతో మరోసారి కాల్పులు జరిపేందుకు పోలీసులు యత్నించిగా తుపాకీ పేలలేదు. బుల్లెట్‌ గాయంతోనే దొంగలు పరారయ్యారు. అయితే, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించిన పోలీసులు మసూద్‌, ఫజల్‌ను 48 గంటల్లోపే అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఓ ద్విచక్రవాహనం, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ గోపాలపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 24 , 2024 | 04:07 AM