Share News

BRS: కాంగ్రెస్‌లోకి అరికెపూడి గాంధీ..

ABN , Publish Date - Jul 14 , 2024 | 04:12 AM

కాంగ్రె్‌సలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు.

BRS: కాంగ్రెస్‌లోకి అరికెపూడి గాంధీ..

  • సీఎం సమక్షంలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే

  • నేడో, రేపో కాంగ్రెస్‌లోకి పటాన్‌చెరు ఎమ్మెల్యే?

హైదరాబాద్‌/పటాన్‌చెరు, జూలై 13(ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సైతం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఎమ్మెల్యేతోపాటు శేరిలింగంపల్లి, మియాపూర్‌, చందానగర్‌, హైదర్‌నగర్‌ కార్పొరేటర్లు నాగేందర్‌యాదవ్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌, మంజులా రఘునాథ్‌రెడ్డి, నార్నె శ్రీనివాస్‌, పలువురు అనుచరులు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాగా.. అరికెపూడి గాంధీతో కలిపి కాంగ్రె్‌సలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరుకుంది.


హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం ఈ వారంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా బీఆర్‌ఎ్‌సఎల్పీని విలీనం చేసుకునే దిశగా కసరత్తు సాగుతున్నట్లు వెల్లడించాయి. కాగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా నేడో, రేపో కాంగ్రె్‌సలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. మైనింగ్‌కు సంబంధించి ఈడీ దాడుల నేపథ్యంలో తొలుత బీజేపీలో చేరాలని గూడెం భావించినా.. అనుచరుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. మరోవైపు, మహిపాల్‌రెడ్డి చేరికను పటాన్‌చెరు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకిస్తుండగా, వారికి నచ్చజెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం యత్నిస్తున్నట్లు తెలిసింది.

Updated Date - Jul 14 , 2024 | 04:13 AM