Share News

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై టెన్షన్‌ వద్దు..

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:13 AM

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

CM Revanth Reddy: ఉద్యోగాల భర్తీపై టెన్షన్‌ వద్దు..

  • నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపొందిస్తాం

  • బడ్జెట్‌ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌: రేవంత్‌రెడ్డి

  • సీఎస్‌, ప్రజాప్రతినిధులు, విద్యార్థి నేతలతో సమావేశం

  • నిరుద్యోగులకు న్యాయం జరిగేలా రూపకల్పన: రేవంత్‌

  • సీఎస్‌, ప్రజాప్రతినిధులు, విద్యార్థి సంఘం నాయకులతో సీఎం భేటీ

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నదని, నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలే తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్ధపూరిత శుక్తల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టారీతిన నిబంధనలు మార్చితే తలెత్తే చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని హామీనిచ్చారు. గత ప్రభుత్వం వ్యవహరించిన విధంగా ఉద్యోగాల భర్తీ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ప్రస్తుతమున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్‌-1 సహా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై శుక్రవారం నిరుద్యోగులు నిర్వహించిన ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సహా సంబంధిత అధికారులతో పాటు, పలువురు ప్రజాప్రతినిదులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో నిరుద్యోగులు లేవనెత్తిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు.


ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలను చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌-1, 2, 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించిందని తెలిపారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోనే చర్చించి, జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్టు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ నియామ పరీక్షలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు ఏర్పడకుండా, నిరుద్యోగులకు పూర్తిన్యాయం జరిగేలా క్యాలెండర్‌ను రూపొందిస్తున్నామన్నారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలకంగా కసరత్తు చేస్తుంటే కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కొందరు చేసే కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియ నిలిచిపోయి, నిరుద్యోగులు మరింత నష్టపోతారని స్పష్టంచేశారు.


నిరుద్యోగుల డిమాండ్లపై చర్చ

సమావేశంలో నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ మేరకు గ్రూప్‌-1 పరీక్ష మెయిన్స్‌కు ఒక్కో పోస్టుకు 1:50నిష్పత్తి చొప్పున కాకుండా 1:100 చొప్పున ఎంపిక చేయాలనే డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం 2022లో ప్రకటించిన గ్రూప్‌-1 పరీక్ష పేపర్ల లీకేజీ, తప్పుడు నిర్ణయాల కారణంగా రెండు సార్లు వాయిదా పడిందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో ఉన్న పలు పిటిషన్లను వెనక్కి తీసుకున్నదని అధికారులు సీఎంకు వివరించారు. పాత నోటిఫికేషన్లను రద్దు చేసి అదనంగా మరిన్ని పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. దాదాపు 12ఏండ్ల తరువాత చేపట్టిన గ్రూప్‌-1 పరీక్షకు 4లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడ్డారని, ఇటీవలే ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పకడ్భందీగా నిర్వహించిందని చెప్పారు. నోటిఫికేషన్‌ ప్రకారం ప్రిలిమ్స్‌లో మెరిట్‌ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక జరుగుతుందని వివరించారు.


ఇప్పుడు ఒక పోస్టుకు 100మందిని ఎంపిక చేసేలా నిబంధనలను సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉందని, నోటిఫికేషన్‌లో ఉన్న నిబంధనలను మార్చితే న్యాయపరంగా చెల్లుబాటుకాదని, నిబంధనలను మార్చితే మళ్లీ ఈ నోటిఫికేషన్‌ కూడా నిలిచిపోతుందని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా గ్రూప్‌-1 పరీక్ష రెండోసారి రద్దయినప్పుడు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి నోటిఫికేషన్‌లో ఉన్న బయోమెట్రిక్‌ పద్ధతిని ఎందుకు పాటించలేదన్న ఏకైక కారణంతో రాష్ట్ర హైకోర్టు పరీక్షను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా 1999లో యూపీఎస్సీ వర్సెస్‌ గౌరవ్‌ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కూడా చర్చించారు. ఆ తీర్పు ప్రకారం నోటిఫికేషన్‌లో పేర్కొన్నదానికంటే ఎక్కువమందికి అవకాశం ఇస్తే ముందుగా ఉన్నవాళ్లకు అన్యాయం జరిగినట్టేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని తెలిపారు.


గ్రూప్‌-2, 3 పోస్టుల పెంపుపైనా చర్చ

సమావేశంలో గ్రూప్‌-2, 3 పోస్టుల పెంపుపైనా చర్చించారు. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం కూడా నోటిఫికేషన్‌ను ఉల్లంఘించినట్టే అవుతుందని తెలిపారు. దాంతో కోర్టులు కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్‌-1కు కొత్తగా నోటిఫికేషన్‌ ప్రకటించడంతో పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని, గ్రూప్‌ -2, 3 నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని స్పష్టంచేశారు. కాగా సమావేశంలో పాల్గొన్న విద్యార్ధి సంఘం నాయకులు మాట్లాడుతూ గ్రూప్‌-2, డీఎస్సీ పరీక్షలు ఒకదానివెంట ఒకటి ఉండడంతో అభ్యర్ధులు నష్టపోతున్నారని సీఎంతో అన్నారు. జూలై 17 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయని, ఆ వెంటనే ఆగ స్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌-2 ఉన్నదని, దాంతో అభ్యర్ధుల ప్రిపరేషన్‌కు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. స్పందించిన సీఎం రేవంత్‌, పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ, విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Jul 06 , 2024 | 03:13 AM